వైకాపా నేతలవి మిడిమిడి జ్ఞానం
అమరావతి ఏప్రిల్ 24
హోంక్వారంటైన్లో ఉండాలని పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి స్పందించారు. తనకు హోంక్వారంటైన్లో ఉండాలంటూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుందని... దేశంలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు తనకుందని తెలిపారు. కొందరు అవగాహన లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.స్థానిక సీఐ, ఎస్సైలు వారికి తెలియక నోటీసులు ఇచ్చారని...24 గంటల పాటు తనకు సెక్యూరిటీ ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు భద్రత కల్పిస్తాయన్నారు. అధికార పార్టీ నేతలు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రుల్ని క్వారంటైన్లో పెడతారా? అని ప్రశ్నించారు. సామాజికసేవ చేస్తున్నవారికి సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగారని విష్ణువర్థన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.