పేద,మద్యతరగతి వర్గాలను మానసిన వత్తిడికి గురిచేస్తున్న కోవిడ్-19
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి కృష్ణారావు విశ్లేషణ
హైదరాబాద్ ఏప్రిల్ 24
కోవిడ్-19 విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో భయబ్రాంతులకు గురవుతున్న వారికి మానసిక బలం అందించే ప్రయత్నానికి కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం మే నెల 3వ తేదీ వరకు రెండో దశ లాక్ డౌన్ పొడిగించింది.కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్ డౌన్ తప్ప మార్గాంతరం లేదని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఊహించని పొడిగింపుతో కొన్ని సంశయాలు , సందేహాలు భిన్న వర్గాల ప్రజలలో పుట్టుకొచ్చాయి.ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా హఠాత్తుగా ఏకంగా 3 వారాలు లాక్ డౌన్ ప్రకటన చేయడం సహేతుకం కాదని విమర్శలు వచ్చాయి. ఆర్ధిక ఇబ్బందులతో సతమతవుతూ కాలం గడుపుతున్నవారిలో బీద, మధ్యతరగతి వర్గాల ప్రజలే ఎక్కువ శాతం ఉన్నారు.తొలి దశ కన్నారెండో దశ లాక్ డౌన్ అదే వర్గాల ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెట్టడం ఖాయం. చేతిలో ఉన్న కొద్ది పాటి డబ్బు తో గుంభనంగా సంసారాలు గడిపిన వారికి ముందున్న రోజులు గడ్డుగానే ఉండగలవని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిత్యావసర సరుకుల లభ్యత తగుమాత్రంగా ఉన్నాచేతిలో డబ్బు లేకపోతే దుర్భర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం తప్పదని వారు సూచించారు. చిన్న తరహా వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజాలు కొంత మేర ప్రజల్ని ఆదుకోవడం హర్షణీయం.. కానీ ఇదే పరిస్థితి ఇంకొంత కాలం కొనసాగితే సామాన్య ప్రజలు కరవు బారిన పడడం తప్పదనిపిస్తోంది. ఒకవైపు దేశంలో కొత్తగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరోవైపు వ్యక్తిగతంగా తాము ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ప్రజలలో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.దీనికి తోడు సామాజిక మాధ్యమాల లో వైరల్ అవుతున్న అనేక అంశాలు ప్రజలలో భయాందోళనలు పెంచుతున్నాయి. లాక్ డౌన్ 3 వ దశ ను ప్రయోగిస్తారని, జూన్ నెల చివరివరకు స్వీయ నియంత్రణ తప్పదని వస్తున్న వార్తలు ప్రజలకు మానసిక క్షోభ కలిగిస్తున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.తీవ్ర నిరాశ, నిస్పృహలు ఆవరిస్తే సమాజం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రజల భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితి ని పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యావశ్యకం. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రజలకు మానసిక ధైర్య స్థైర్యాలను కల్పించే దిశగా జాతీయ స్థాయి నిపుణుల తో కూడిన ” కౌన్సిలింగ్ వ్యవస్థ”ను నెలకొల్పడం ప్రశంసనీయం.కొన్ని సామాజిక మాధ్యమాలు వ్యాప్తి చేస్తున్న నకిలీ వార్తలను నమ్మ వద్దని ప్రజలను ప్రభుత్వాలు అప్ర్రమత్తం చేయాలి. ప్రజలను అనవసరంగా ఉద్రిక్తతలకు, మానసిక ఒత్తిళ్ళకు గురి చేస్తున్న మాధ్యమాలను కట్టడి చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ అనుభవిస్తున్న ప్రజలు ఎవరికి వారు మానసిక బలాన్ని కోల్పోకుండా తగిన జాగ్రత్తలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం.