నగర, పురపాలక సంస్థల పరిధి బయట విద్యుత్ ప్రాజెక్టుల పనులకు కేంద్రం అనుమతి
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 24
పుర, నగరపాలక సంస్థల పరిధి బయట జరిగే విద్యుత్ ప్రాజెక్టుల పనులను అనుమతించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచన చేసింది. కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే విద్యుత్ పనులను ప్రారంభించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు, డీఎంలు, పోలీసు, మున్సిపల్ శాఖలకు 20.04.2020న కేంద్ర విద్యుత్ శాఖ సమాచారాన్ని పంపింది. 15.04.2020న హోంశాఖ జారీ చేసిన ఆర్డర్ లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నగర, పురపాలక సంస్థల పరిధి బయట ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టుల పనులను 20 ఏప్రిల్, 2020 నుంచి అనుమతించొచ్చని కేంద్ర విద్యుత్ శాఖ చెప్పింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బొగ్గు/జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ప్రాజెక్టుల పనులకు కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. 15.04.2020న కేంద్ర హోమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన సామగ్రి రవాణాను ఒక రాష్ట్రం నుంచి మరొకర రాష్ట్రానికి, రాష్ట్రాల లోపల కూడా అనుమతించాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కేంద్ర హోంశాఖ మరియు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం, కార్మికుల ఆరోగ్యం కోసం తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది.అన్ని సీపీఎస్యూలు, ఐఐపీలు, యూఎంపీపీల సీఏండీలకు కార్మికుల ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతలను విద్యుత్ శాఖ అప్పగించింది. విద్యుత్ కార్యాలయాల సిబ్బందితోపాటు, పనుల కోసం తరలించే కార్మికులకు కొవిడ్-19 వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని, అవసరమైన రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న విద్యుదుత్పత్తి సంస్థలు, ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థల విషయంలోనూ ఈ తరహా జాగ్రత్తలు పాటించేలా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ సూచన చేసింది.