అదిలాబాద్ జిల్లాలో మంచి నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. జిల్లాలో మొత్తం రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకాల ద్వారా దాహం తీరకపోగా తాజాగా మరమ్మతులకు మళ్లీ నిధులు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. జైనథ్, బోథ్లలో రెండుచోట్ల రక్షిత మంచినీటి పథకాలు వృథాగా ఉన్నాయి. 18 మండలాల్లో ఈ పథకాలు ఉండగా,,మిగితా 92 చోట్ల రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించగా నాసిరకంగా ఉన్న మోటార్లు చెడిపోయాయి. పైప్లైన్ లీకేజీలతో సగం కంటే ఎక్కువ పథకాలు పనికి రాకుండా తయారయ్యాయి.ప్రపంచ బ్యాంకు పథకాన్ని ఎత్తివేసి నాలుగునెలలకు పైగా కావొస్తుండడంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఆ జాబితాలే లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టాగా నిలుస్తోంది. ప్రపంచబ్యాంకు కార్యాలయ సిబ్బంది వెళ్లిపోయినప్పటినుంచి ఈ పథకాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. తాజాగా వీటికి మరమ్మతులు చేస్తారా? అలాగే వదిలేస్తారా? అనేది అంతుబట్టడంలేదు. అధికారుల పర్యవేక్షణ లేకనే ఈ దుస్థితి ఏర్పడింది. జూన్లోగా ఇంటింటికి కుళాయిద్వారా నీరు అందిస్తామని అధికారులు చెబుతుండగా చెడిపోయిన ఈ పథకాలకు ఎప్పుడు మరమ్మతులు చేస్తారు, మిషన్ భగీరథకు ఎప్పుడు అనుసంధానంచేస్తారనేది అయోమయంగా మారింది. బోథ్ మండల కేంద్రంలోని కరత్వాడ జలాశయం పక్కన రూ.13కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో నిర్మించిన నీటి పథకంతో చుట్టుపక్కల నాలుగు గ్రామపంచాయతీలకు తాగునీరిందించాలనేది ఉద్దేశం. అక్కడక్కడ పైప్లైన్లు లీకేజి ఉండడం.. పనుల్లో పారదర్శకత కనిపించకపోవడంతో ఐదేళ్లైనా మోక్షంలేదు.ఇంద్రవెల్లి మండలంలో దస్నాపూర్, కన్నాపూర్, తలమడుగు మండలంలోని రత్నాపూర్లలో పథకాలు ఏళ్లుగా పనిచేయడంలేదు.