తమిళనాడులో లాక్ డౌన్
చెన్నై, ఏప్రిల్ 25
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నాలుగు రోజుల పాటు తమిళనాడులో కఠినమైన రీతిలో లాక్డౌన్ అమలు చేయనున్నారు. దీంతో ఇవాళ జనం మార్కెట్లకు పోటెత్తారు. కూరగాయలు, కిరాణా దుకాణాలకు ఎగబడ్డారు. చెన్నైతో పాటు కోయంబత్తూర్, తిరుపుర్, మధురై, సేలం పట్టణాల్లో జనం మార్కెట్ల వద్ద నిత్యావసరాలు కొనేందుకు బారులు తీరారు. కూరగాయలు, కిరాణా దుకాలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఓపెన్ ఉంటాయని సీఎం పళనిస్వామి తెలిపారు. లాక్డౌన్ అమలైతే పరిస్థితి కష్టంగా ఉంటుందని భావించిన జనం.. వేల సంఖ్యలో మార్కెట్ల బాట పట్టారు. ఆ టెన్షన్లో వారంతా సోషల్ డిస్టాన్సింగ్ పాఠించలేదు. చెన్నై, మధురై, కోయంబత్తూర్ పట్టణాల్లో నాలుగు రోజుల పాటు, సేలమ్, తిరుపుర్ పట్టణాల్లో మూడు రోజుల పాటు కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ అయిదు పట్టణాల్లో ఎటువంటి షాపులు తెరవరు. కేవలం మొబైల్ వెజిటెబుల్ ఔట్లెట్స్ ద్వారా మాత్రమే కూరగాయలు అమ్ముతారు. హాస్పిటల్ ఫార్మసీలు, మెడికల్ షాపులను తెరిచి ఉంచనున్నారు. లాక్డౌన్ అయిన నగరాల్లో రెండు దఫాలు డిస్ఇన్ఫెక్షన్ డ్రైవ్లు నిర్వహిచనున్నారు. ఏటీఎంలు, అన్నా క్యాంటీన్లు తెరుచుకుని ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఇప్పటి వరకు 1800 మందికి కరోనా వైరస్ సోకింది. 22 మంది మరణించారు. చెన్నైలో 452, కోయంబత్తూర్లో 141, తిరుపుర్లో 110, మధురైలో 56, సేలమ్లో 30 కేసులు నమోదు అయ్యాయి.