లాక్డౌన్ పొడిగింపుపై మోదీ ప్రకటన !
- కిషన్ రెడ్డి
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 28
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అడిగి తెలుసుకున్నారు. మే 3 వరకు పొడిగించిన రెండో దశ లాక్ డౌన్ ను ఇంకా పొడిగింపుపై మే2న ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించాక మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే హాట్ స్పాట్ , రెడ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ యథాతథంగా ఉంటుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు మాత్రం పనిచేయవని స్పష్టం చేశారు. అటు కరోనా నియంత్రణపై రెండు తెలుగు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి కితాబిచ్చారు. మే 3 వరకు పొడిగించిన రెండో దశ లాక్ డౌన్ ను ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో తదుపరి చర్యలేంటనే దానిపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోంది.లాక్ డౌన్ ను కొనసాగిం చాల్సిందిగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరినట్టుగా తెలుస్తోంది. వారితో పాటు బిహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం లాక్ డౌన్ ను కొనసాగిస్తేనే పరిస్థితి మెరుగవుతుందని ప్రధానికి సూచించారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండడం, రాబోయే రోజుల్లో మరింత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులిచ్చిన సలహాలు, సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది.