బాబుకు బ్రేక్ లు వేసిన కరోనా
విజయవాడ, ఏప్రిల్ 29
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలకు కరోనా బ్రేకులు వేసింది. నిజానికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణులన్నీ పూర్తిగా డీలా పడ్డాయి. చంద్రబాబు అప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత నుంచి పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీకి కేవలం 23 స్థానాలు మాత్రమే రావడంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ డీలా పడింది.ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఆశలు పెట్టుకుంది. కానీ ఫలితాలు చూసిన తర్వాత వాళ్లకు సీన్ అర్థమయింది. చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారన్న అభిప్రాయం పార్టీనేతల్లో బాగా ఏర్పడింది. అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది గమనించిన చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారు.జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. సమీక్షల పేరిట క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాలని ప్రయత్నం చేశారు. కానీ వీలు కాలేదు. సమీక్షల తర్వాత కూడా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు. దీంతో చంద్రబాబు మహానాడు ఈసారి జరిపి కార్యకర్తల్లో జోష్ నింపాలని భావించారు. గత ఏడాది మహానాడు కూడా ఎన్నికల కారణంగా జరపలేదు. ఈసారి మహానాడును పెద్దయెత్తున జరిపి తిరిగి కార్యకర్తల్లో ధైర్యం నింపాలని చంద్రబాబు ఆలోచన చేశారు.ఈ మేరకు సీనియర్ నేతలతోనూ చర్చించారు. ఓటమి బాధ నుంచి క్యాడర్ ను బయటపడాలంటే మహానాడులో వారికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఏడాది గడుస్తుంది కాబట్టి ప్రభుత్వం పై వ్యతిరేకత రావడం ఖాయమని, తద్వారా క్యాడర్ ను కూడా ఉత్తేజపర్చ వచ్చని చంద్రబాబు భావించారు. కానీ కరోనా కారణంగా మహానాడు జరిగే అవకాశాలు లేవు. ఈ ఏడాది కూడా మహానాడు జరగనట్లే. వరసగా రెండేళ్లు మహానాడు జరగకపోవడం ఇదే ప్రధమమని చెబుతున్నారు. మహానాడు ద్వారా క్యాడర్ లో జోష్ నింపాలనుకున్న చంద్రబాబు ఆలోచనలకు కరోనా బ్రేక్ వేసిందనే చెప్పాలి.