దేశంలో వెయ్యి దాటిన కరోనా వైరస్ మృతుల సంఖ్య
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 29
దేశంలో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటింది. సుమారు 1007 మంది వైరస్ వల్ల మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 31 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సుమారు 7696 మంది రోగులు వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 24.56 శాతంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. 8,500 వైరస్ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. తమిళనాడులో మంగళవారం కొత్తగా 121 కేసులు నమోదుకాగా, అందులో ఐదు రోజుల శిశువు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని సాధికారిత బృందం చైర్మన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్రలోని ముంబై, పుణె, గుజరాత్లోని అహ్మదాబాద్, రాజస్థాన్లోని జైపూర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్, తెలంగాణలోని హైదరాబాద్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని చెప్పారు. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 20 దేశాల్లో భారత్ కంటే 200 రెట్ల మేర మరణాలు, 84 రెట్ల మేర కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. ఈ 20 దేశాల మొత్తం జనాభా భారత్తో సమానమని తెలిపింది. దేశంలో పరీక్షించిన వారిలో సగటున 25 మందిలో ఒకరికి పాజిటివ్గా తేలినట్లు తెలిపింది. సగటున 30 మందిలో ఒకరు మరణిస్తుండగా, నలుగురిలో ఒకరు కోలుకుంటున్నట్లు వెల్లడించింది.