YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దైవత్వం

దైవత్వం
దైవత్వం
దేవుడు మనిషిలోనే ఉన్నాడనే సత్యమే ఆత్మజ్ఞానం. రాళ్లలో, చెట్లలో, పుట్టల్లో, గుడి గోపురాల్లోని విగ్రహాల్లో కనిపించే దేవుడు తోటి మనిషిలో ఎందుకు కనిపించడు? ఆ లోపం దృష్టిలో ఉందే తప్ప, సృష్టిలో లేదు. దయ, జాలి, కరుణ, ప్రేమ- దైవీ సంపద, సత్వగుణాలు. అవి దైవంలోని లక్షణాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహంకారం, మమకారాలు- రజోగుణ ప్రధానాలు. అవి మనిషి స్వభావాలు. అరాచకం, నిర్లక్ష్యం, అకృత్యాలు, భయాందోళన కలిగించేవి తమోగుణాలు. అవి రాక్షస ప్రవృత్తి. సహజ స్వభావాలను మరిచి దైవీ సంపదను అలవరచుకునే మనిషి దేవుడిగా మన్ననలందుకుంటాడు. మనిషిలోని ఆనందం స్వర్గం, దుఃఖమే నరకం అంటుంది సుమతీ శతకం. అందరిలోని చైతన్యాన్ని గౌరవించి, మానవీయ విలువలతో జీవించడమే ఆనందానికి మూలం. ఎదుటి మనిషిని గౌరవంగా ఆరాధించి, ప్రేమించి, సహాయం అందిస్తే అదే దైవత్వం. చేతులతో, చేష్టలతో, మాటలతో బాధించడమే అసురత్వం. ప్రతి మనిషిలో దైవాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక జ్ఞానమార్గం. అందరియందు, అన్నింటియందు సమత్వ దృష్టి మానవత్వమని భగవద్గీత బోధించింది. తనకు ఎదురుగా వచ్చిన మనిషిని పక్కకు తప్పుకొమ్మని చెప్పిన శంకరాచార్యులతో- ఎవర్ని తప్పుకొమ్మంటావు... ఈ శరీరాన్నా, దీనిలోని అంతర్యామిగా ఉన్న దివ్యశక్తినా అని అడిగాడు. ఆ ప్రశ్నతో అతడిలోని పరమేశ్వరుణ్ని శంకరులు దర్శించారు. కోహం (ఎవరు నీవు) నుంచి సోహం (దైవమే నేను) వరకు ప్రయాణమే జ్ఞానమార్గం. అంగవైకల్యం, శరీరం రంగు, బాహ్యమైన ఆకారం చూడకుండా మనిషిలోని దివ్య చైతన్యాన్ని విష్ణుస్వరూపంగా దర్శించాలని భక్తి, జ్ఞాన యోగాలు బోధించాయి. శ్రీరాముడికి కోతుల్లో వీరత్వం, పరాక్రమం, త్యాగశీలత కనిపించాయి. కోతిగా జన్మించిన వానర వీరుడు అసమాన బలంతో, సేవాతత్పరతతో దేవుడిగా కీర్తిపొంది, ఊరూరా పూజలందుకొంటూ అభయప్రదాత ఆంజనేయుడైనాడు. ఎలుగుబంటి జాంబవంతుడు, రాక్షసుడైనా లంకా నగర చక్రవర్తిగా విభీషణుడు, స్నేహానికి ప్రాణమిచ్చిన సుగ్రీవుడు- జ్ఞాన సంపన్నులుగా నిలిచారు. సేవాభావాన్ని ప్రదర్శించి, ఉడుత శాశ్వత కీర్తి పొందింది. ఆపన్నయైన స్త్రీని కాపాడాలని తన ప్రాణాలను త్యాగం చేసి పోరాడిన జటాయువు చరిత్రలో నిలిచిపోయింది. మనిషిని ద్వేషించి దేశాన్ని ప్రేమిస్తే ప్రయోజనం లేదు. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ మాట ఎవరికైనా అడుగుజాడ. మనిషి దైవత్వ లక్షణాలు సంతరించుకునే సాధనా మార్గాలే మానవతా విలువలు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనేవి పంచామృత మంత్రాలు. సత్యం శాశ్వతం. అంతటా వ్యాపించి ఉన్న సత్యాన్ని అన్వేషించకుండా అనుసరించాలి. సృష్టి సర్వం విష్ణుస్వరూపం అనే అనుభూతి సత్యమార్గం. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడం ధర్మం. నీ పని నీవే చేయి, ధర్మం దానంతట అదే రక్షింపగలుగుతుంది. శారీరక శాంతి, మానసిక ప్రశాంతి ఆరోగ్యానికి మూలం. ధ్యానం, జపం, నామస్మరణ, ఆధ్యాత్మిక కార్యాచరణ- శాంతికి ప్రతిరూపాలు. నేను అనే అహంకారం, కావాలి అనే కోరిక తొలగితే- శాంతి మిగులుతుంది. ప్రేమకు పరిమితి లేదు. విశ్వజనీనమైన ఆరాధన భావం, క్షీరసాగరం వంటిది. ప్రేమను ఎంతగా ప్రేమిస్తే అది అంతగా అమృతాన్ని అందిస్తుంది. ప్రేమగల హృదయం దైవ మందిరం. మనిషిని మార్చగల మరో ఆయుధం ప్రేమ. అహింస అన్ని ధర్మాల్లోకీ అత్యుత్తమమైంది. అహింస అనే ఆయుధంతో దేశ చరిత్రను మార్చగలిగిన మహనీయుడిగా గాంధీజీది చెక్కుచెదరని స్థానం.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో
 

Related Posts