పేద ప్రజలను ఆదుకునేందుకు రూ.65వేల కోట్లు అవసరం: రఘురామ్ రాజన్
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 30
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ మధ్య ఇవాళ కరోనా వైరస్ సంక్షభంపై చర్చ జరిగింది. ఇండియాలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందని రాజన్ను రాహుల్ అడిగారు. సుమారు 65వేల కోట్ల అవసరం ఉంటుందని రాజన్ సమాధానం ఇచ్చారు. దేశంలోని పేదలను ఆదుకునేందుకు ఈ బడ్జెట్ అవసరమని, భారత్ కచ్చతంగా ఆ బడ్జెట్ కలిగి ఉండాలని రాజన్ అన్నారు. దేశంలో ఉన్న అసమానతలను ఎలా ఎదుర్కోవాలని కూడా రాహుల్ ఓ ప్రశ్న వేశారు. దానికి రాజన్ సమాధానం ఇస్తూ.. పేద ప్రజలకు ఉత్తమ జీవితాన్ని కల్పించేందుకు ఉపాయాలు ఉన్నాయని, కానీ వాటిపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పరిపాలనా విధమైన సవాల్ చాలా కీలకమైందన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల మధ్య చాలా ఛాలెంజింగ్ పరిస్థితి ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడే వారు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆర్థిక వ్యవస్థను వీలైనంతగా విస్తృతపరచాలన్నారు. లాక్డౌన్ను ఎలా ఎత్తివేయాలని వేసిన రాహుల్ ప్రశ్నకు రాజన్ సమాధానం ఇస్తూ.. కరోనా కేసులను ఐసోలేట్ చేసిన తర్వాతనే రీఓపెనింగ్ గురించి ఆలోచించాలన్నారు.