కన్నాకు దక్కని మద్దతు
గుంటూరు, మే 2
జుట్టు జుట్టు పట్టుకుంటేనే తప్ప.. ఎవరు బలవంతులో తేలిపోదన్న సామెత మాదిరిగా రాష్ట్రంలో బీజేపీ బలం ఎంతో తెలిసేందుకు వైసీపీ నాయకుడు, బీజేపీ చీఫ్ కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నాయకుడు సాయిరెడ్డి, బీజేపీ ఏపీ సారధి కన్నా లక్ష్మీనారాయణలు రెండు రోజులకు పైగా తీవ్ర రాజకీయ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే, వైసీపీ తరఫున మాట్లాడిన సాయిరెడ్డిపై కన్నా రెచ్చిపోయారు. ఈ క్రమంలో సాయిరెడ్డికి అనుకూలంగా కొందరు నాయకులు నోరు విప్పారు. కన్నాకు మాట్లాడడం కూడా రాదంటూ.. వైసీపీ నేతలు విమర్శలు వచ్చాయి.కానీ, బీజేపీ నుంచి మాత్రం కన్నాకు పెద్దగా మద్దతు లభించలేదు. ఎమ్మెల్సీ మాధవ్ ఒక్కరే ఒకటీ అరా మద్దతిచ్చినా.. కేంద్రం స్థాయిలో మాత్రం కన్నాకు మద్దతు లభించలేదు. నిజానికి సాయిరెడ్డి చేసిన ఆరోపణలు ఏమీ సాధారణమైనవి కావు. బీజేపీ గత ఎన్నికల సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకులకు ఇచ్చిన ఎన్నికల నిధులను కన్నా, పురందేశ్వరి వంటి నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని, తన వద్ద బీజేపీకి సంబంధించిన నిధుల లెక్కలు పూర్తిగా ఉన్నాయని సాయిరెడ్డి తీవ్ర ఆరోపణే చేశారు. ఈ విషయంలో రాష్ట్ర నాయకులకన్నా కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దలు తీవ్రంగా స్పందిస్తారని అందరూ అనుకున్నారు.కన్నాకు అన్ని విధాలా మంచి సపోర్టు లభిస్తుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ వర్గం మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.అ యితే, అనూహ్యంగా బీజేపీ–వైసీపీ మధ్య మొదలైన లడాయి టీ కప్పులో తుఫానుగా తేలిపోవడంతో, ఉభయ పక్షాల మధ్య ఢిల్లీస్థాయిలో లోతైన అవగాహన ఉందని మాత్రం స్పష్ట మవుతోంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలపడటం అనేది ఇప్పట్లో జరగదన్న అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కన్నా నాయకత్వానికి కూడా పెద్దగా ఎవరూ మద్దతివ్వకపోవడం కూడా రాష్ట్రంలో ఆయన నాయకత్వ లోపాన్ని ఎత్తి చూపుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.అంటే, నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో బీజేపీకి మంచి బలం ఉందని చెబుతూ వచ్చిన కన్నాకే మద్దతు ఇచ్చేవారు లేకపోయిన విషయం అయితే క్లియర్గా తేలిపోయింది. ఇక అప్పుడెప్పుడో 1998లో నాటి సమైక్యాంధ్రలో బీజేపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేసి కాకినాడ, రాజమహేంద్రవరం ఎంపీ సీట్లను సొంతంగా గెలుచుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు సరికదా .. కన్నా, పురందేశ్వరి, పైడికొండల లాంటి వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు. దీనిని బట్టి ఓ వైపు దేశవ్యాప్తంగా మోడీ ప్రభ వెలుగుతున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ను వెనక్కు నెట్టి రెండో ప్లేస్లోకి వెళుతున్నా ఏపీలో ముప్ఫై యేళ్లు వెనక్కి వెళ్లినట్టే కనిపిస్తోంది. మొత్తాని కి రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే.. మోదీ ఇంకేదైనా చేయాలేమో చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.