భానుడి ప్రకోపానికి ఉక్కిబిక్కిరైన నగర జనం.. వరుణుడి హోరుతో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి మరింత ఇబ్బందులు పడ్డారు. చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలాయి. కొన్నిచోట్ల వాటికింద పడి కార్లు ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల మోకాలి లోతు నీళ్లతో రోడ్లు కొలనులను తలపించాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం హోరెత్తించింది. అకాల వర్షానికి తార్నాక, వెంగళరావు నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. తార్నాకలో విద్యుత్తు స్తంభం విరిగి పడింది. వెంగళరావునగర్లో చెట్టు విరిగిపడడంతో ఓ కారు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యాయి. పంజగుట్ట బజాజ్ ఎలక్ర్టానిక్స్ వద్ద నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ కూలింది. హోర్డింగ్లకు ఉన్న ఫ్లెక్సిలు చిరిగి రోడ్లపై పడడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మారేడ్ పల్లి, తుకారంగేట్, అడ్డగుట్ట, చిలకలగూడ, కార్ఖానా, బోయిన్ పల్లి, తిరుమల గిరి, అల్వాల్, సనత్ నగర్, ఎస్సార్ నగర్, యూసఫ్గూడ, మోతీనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదాపేట్, సరూర్ నగర్, తార్నాక, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్, మల్లాపూర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్ పురా, చాంద్రాయణ గుట్ట, యాకుత్పురాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
ఢిల్లీలో కూలిన వైసీపీ టెంట్
అటు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఈదురు గాలులు, దుమారం చెలరేగిన అనంతరం వర్షం కురిసింది. దీంతో, జనజీవనం స్తంభించిపోయింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కాగా, ఏపీ భవన్ వద్ద వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో, దీక్షా శిబిరంలోని వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఏపీ భవన్ లోకి వెళ్లారు. ఏపీ భవన్ లోపల తమ దీక్షను వారు కొనసాగిస్తున్నారు.