పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ ఎక్కడున్నాడో కేంద్రం స్పష్టం చేసింది. నీరవ్ మోడీ ప్రస్తుతం హాంకాంగ్లో తలదాచుకున్నట్లు పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నీరవ్మోదీ ప్రొవిజనల్ అరెస్ట్ కోసం హాంకాంగ్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ విషయమై.. హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ను, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను కోరినట్లు సభలో వెల్లడించారు. మార్చి 23నే ఈ అభ్యర్థనను సమర్పించినట్లు స్పష్టం చేశారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీల పాస్పోర్టులను కూడా ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిందని సింగ్ తెలిపారు.మరో వైపు హై ప్రొఫైల్ కేసులను వాదించడంతో దిట్టగా పేరున్న విజయ్ అగర్వాల్ ద్వారా కోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 2జీ కుంభకోణం కేసులో అనేకమంది నిందితుల తరపున వాదించిన విజయ్ అగర్వాల్... ఇటీవల ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఐఎం ఖురేషి తరపున కూడా వాదించారు. పలు కీలక ఫోన్ సంభాషణలు లీక్ అవ్వడంతో ఖురేషీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా బయటపడిన పీఎన్బీ కుంభకోణంలో రూ.11 వేల కోట్ల మేర జరిగిన అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులు గత నెలలోనే విదేశాలకు వెళ్లిపోయారు. పీఎన్బీ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది.రూ.12,600 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో నీరవ్, చోక్సీ నిందితులుగా తేలిన విషయం తెలిసిందే. ముంబయి కోర్టు వీరిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ కూడా జారీ చేసింది. సీబీఐ ఇప్పటివరకు పీఎన్బీ కుంభకోణంతో సంబధం ఉన్న 16 మందిని అరెస్టు చేసింది. అయితే విదేశాలకు పారిపోయిన వీరిని భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.