నానాటికి తీసికట్టు.... టీడీపీ పరిస్థితి
విజయవాడ, మే 4,
రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఇప్పటికేతే ఫర్వాలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. కరోనా ఎఫెక్ట్ కారణంగా పార్టీ కొన్ని కీలక ఇబ్బందులను తట్టుకుని నిలబడింది. నాయకులు జంపింగులు తగ్గించారు. ఇక, పార్టీ తరఫున కూడా గట్టి వాయిస్ వినిపించేందుకు అవకాశం ఏర్పడింది. మరి ఈ సమయంలోనూ కొన్ని నియోజక వర్గాల పరిస్థితి మాత్రం దారుణంగా కనిపిస్తుండడం ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాల్గా మారింది. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇక, ఆ ఎన్నికల్లో కొందరు పట్టుబట్టి టికెట్లు సంపాదించు కున్నారు. వీరిలో కురువృద్ధులు కూడా ఉన్నారు. వారంతా ఓడిపోయారు.అదే సమయంలో కొందరు విదేశాల నుంచి కూడా వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసి .. ఓడిపోయిన నేపథ్యం లో వెంటనే తిరుగు టపాలో విదేశాలకు వెళ్లిపోయారు. వ్యాపారాలు పక్కన పెట్టి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు పార్టీని పక్కన పెట్టేసి వ్యాపారాల్లో మునిగిపోయారు. ఇక వృద్ధులు పోటీ చేసిన ఓడిపోయిన నియోజక వర్గాల్లోనూ, విదేశాల నుంచి వచ్చి పోటీ చేసి ఓడిపోయి వెళ్లిపోయిన వారి స్థానాల్లోనూ ఇంచార్జ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో తమను నియమించండంటూ.. కొందరు నేతలు పనిగట్టుకుని కోరు తున్నారు. మరికొన్ని చోట్ల అస్సలు నాయకులే లేని పరిస్థితి వచ్చింది. ఇంకొన్ని చోట్ల కొందరు ఆధిపత్య ధోరణితో యువ నాయకత్వానికి చెక్ పెడుతున్నారు.రకరకాల కారణాలతో టీడీపీకి ఇన్చార్జ్లు లేకపోవడం.. బలమైన నాయకత్వం లేని నియోజకవర్గాలు ఏపీ మొత్తం మీద 30కు పైగానే ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం, కురుపాం, సాలూరు, రాజాం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, అనంతపురం జిల్లా ధర్మవరం, కడప జిల్లా పులివెందుల, నెల్లూరు జిల్లా ఆత్మకూరు సహా అన్ని నియోజకవర్గాలు.. టీడీపీ జెండా పట్టుకునే వారు , టీడీపీ వాయిస్ వినిపించే వారు కూడా కనిపించడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో తమకు బాధ్యత అప్పగించకపోయినా.. కూడా కొందరు యువ నాయకులు దూకుడుగానే ఉన్నారు.ఇక గుంటూరు జిల్లా సత్తెనపల్లి, ప్రకాశం జిల్లా దర్శి, యర్రగొండపాలెం, చీరాలలో పార్టీ పరిస్థితి ఘోరంగానే ఉంది. ఇక మరికొన్ని చోట్ల నాయకులను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి చోట్ల నాయకత్వాన్ని బలపరిచేందుకు చంద్రబాబు ముందుకు సాగాలి… లేనిపక్షంలో అసలు ఈ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్లో కనీసం ధైర్యాన్ని నింపే నాయకులు కూడా లేకుండా పోతారు.