సుబ్బారెడ్డికి నిబంధనలు వర్తించవా
విజయవాడ మే 3
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే సిఎం జగన్ మాత్రం నవరత్నాలుపై దృష్టి పెట్టారు. ఇళ్ళ స్థలాలకు భూములు సేకరణ పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ, రాజానగరం నియోజకవర్గాలలో లోతట్టు ప్రాంతాలను ఇళ్ళ స్థలాలకై భూములు సేకరిస్తున్నారు. నివాసయోగ్యానికి పనికిరాని భూములకు రెట్టింపు రేట్లు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో చెల్లిస్తున్నారు. ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలనుకున్న మడ అడవుల భూములకు కేంద్రం అడ్డుకట్టవేసింది. ఆదాయం కోసమే మద్యం షాపులు రేట్లు పెంచి అమ్మడానికి అనుమతి ఇచ్చారని అన్నారు. మద్యపాన నిషేధం విధానమని చెప్పిన వైసీపీ దానిపై ఆదాయానికి ప్రయత్నిస్తోంది. సేల్స్ టాక్స్ పోయినందున అర్జంట్ ఆదాయం కోసం లాక్ డౌన్ లోనే దుకాణాలు తెరవాలని తహతహలాడుతున్నారు. తిరుమల లో స్వామివారి దర్శనం కోసం వైవి సుబ్బారెడ్డి ఇతర రాష్ట్రం నుంచి ఎలా వస్తారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎలా దర్శనం చేసుకుంటారు..ఆయనపై ఏం చర్య తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజలకో న్యాయం , వైసీపీ నేతలకో న్యాయమా.,. హైదరాబాద్ నుంచి చంద్రబాబు వస్తానంటే లాక్ డౌన్ నిబంధనలు అంటున్నారే. మరి వాటిని ఉల్లంఘించి వైవి సుబ్బారెడ్డి కుటుంబం తో సహా తిరుమల కు ఎలా వస్తారు. నిబంధనలు ఆయనకు వర్తించవా అని నిలదీసారు. మీడియా గొంతు నొక్కడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని అయన అన్నారు.