వలస కూలీల టికెట్ ఖర్చు మేం భరిస్తాం : సోనియా గాంధీ
న్యూ ఢిల్లీ మే 4
దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో స్వంత స్థలాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి వద్ద రైల్వే టికెట్ వసూల్ చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. వలస కూలీల టికెట్ల ఖర్చును తామే భరిస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అన్ని చర్యలు తీసుకుంటాయని ఆమె తెలిపారు. వలస కూలీల సేవలో ఇదో చిన్న సాయంగా భావిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. విపత్కర సమయంలో వారికి సంఘీభావంగా నిలవనున్నట్లు సోనియా తెలిపారు.లాక్డౌన్ సమయంలో కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే ఇచ్చారని, దీంతో వలస కూలీలు ఎక్కడికక్డ చిక్కుకుపోయినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సంక్షోభ సమయంలో కూలీల నుంచి టికెట్ చార్జీలు వసూల్ చేయడం దారుణమని సోనియా అన్నారు. కూలీలను సురక్షితంగా స్వంత ప్రాంతాల్లో వదలడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇప్పటికీ లక్షలాది మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు ఆమె ఆరోపించారు. అహ్మదాబాద్లో జరిగిన నమస్తే ట్రంప్ ఈవెంట్కు జనాలను తీసుకువచ్చేందుకు వంద కోట్లు ఖర్చు చేశారని, పీఎం రిలీఫ్ ఫండ్కు రైల్వే శాఖ 151 కోట్లు ఇచ్చిందని, కానీ కూలీలను తరిలించేందుకు వారి నుంచి టికెట్ ఛార్జీ వసూల్ చేయడం హేయంగా ఉందన్నారు.