కరోనా నేపథ్యంలో బీజేపీ రాజకీయాలకు దూరం
తాము రాజకీయాలు చేయాలనుకుంటే మంత్రులు బయట తిరగలేరు: డీకే అరుణ
హైదరాబాద్ మే4
కరోనా నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నేత డీకే అరుణతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో టెస్టులు చేయకపోవడాన్నితప్పుపడుతున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తోందని, విమర్శలు కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి 590 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఇంత తక్కువ టెస్టులు తెలంగాణలోనే జరుగుతున్నయని అన్నారు. మహారాష్ట్రలో 10 లక్షల మందికి రెండు వేల టెస్టులు జరుతున్నాయని రామచంద్రరావు చెప్పారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ చేస్తున్న అరాచకాలపై స్పందించకుండా టీఆర్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు బాధ్యతాయుతంగా తమ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారని రామచంద్రరావు తెలిపారు. బీజేపీ సూచనలపై మంత్రులు రాజకీయాలు చేయటం సిగ్గుచేటని ఆ పార్టీ నేత డీకే అరుణ విమర్శించారు.తాము రాజకీయాలు చేయాలనుకుంటే మంత్రులు బయట తిరగలేరని హెచ్చరించారు. పంటల కొనుగోళ్లపై సీఎం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఐకేపీ సెంటర్లలో అనేక కారణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని డీకే అరుణ విమర్శించారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే ముందుగా గోనె సంచులు ఇస్తున్నారన్నారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణలో 24 గంటల విద్యుత్ అని డీకే అరుణ పేర్కొన్నారు.