మమత రౌండ్ అయిపోతున్నారా...
బెంగాల్, మే 5,
కరోనా సమయంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మమత బెనర్జీ కేంద్రంగా అన్ని పార్టీలూ విమర్శలకు దిగుతున్నాయి. ఇందుకు పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు ఉండటమే ఇందుకు కారణం. పశ్చిమ బెంగాల్ లో ఈ సారి త్రిముఖ పోటీ ఉండే అవకాశముంది. బీజేపీ పుంజుకుంది. అధికారంలో ఉన్న మమత బెనర్జీ ఇటుబీజేపీని, అటు కాంగ్రెస్ ను రానున్న ఎన్నికల్లో ఎదుర్కొనాల్సి ఉంది.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో లభించిన విజయంతో ఉత్సాహం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన పాత ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కరోనా సమయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ కూడా మమత బెనర్జీ పై విరుచుకు పడుతోంది. ఇందుకు మమత వైఖరే కారణమని కాంగ్రెస అంటోంది.మమత బెనర్జీ కరోనా మరణం రాష్ట్రంలో సంభవించినా, దానిని మరో రోగం పేరిట రిజిస్టర్ చేయిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్వయంగా లోక్ సభ కాంగ్రెస్ పార్టీ నేత అథీర్ రంజన్ చౌదరి ఈ ఆరోపణలు చేయడం వెనక హైకమాండ్ హస్తం ఉందని మమత బెనర్జీ నమ్ముతున్నారు. కాంగ్రెస్ తిరిగి కోలుకోవాలంటే మమతపై మాటల దాడికి దిగడమే మార్గమని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే మమత బెనర్జీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.ఇక బీజేపీ ఎలాగూ మమత బెనర్జీని గత కొంతకాలంగా వెంటపడుతూనే ఉంది. ముఖ్యంగా తనను అప్రదిష్టపాలు చేస్తున్న బీజేపీ సోషల్ మీడియా వింగ్ పై మమత బెనర్జీ మండిపడుతున్నారు. తబ్లిగీ కార్యకర్తల పట్ల మమత బెనర్జీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. వామపక్షాలు సయితం మమత బెనర్జీ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీని అన్ని రాజకీయ పార్టీలూ రౌండ్ చేశాయి. మమత దీన్నుంచి ఎలా బయటపడతారో చూడాలి.