మంత్రుల మధ్య విబేధాలు...
ఏలూరు, మే 5
చెరుకువాడ శ్రీరంగనాథరాజు. ప్రస్తుతం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో కన్నా వ్యాపార దిగ్గజంగా ము ఖ్యంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన ఓ వర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్షత్రియ వర్గానికి చెందిన రంగనాథరాజు గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా పార్టీలో చేరడం, ఆవెంటనే ఆయన ఆచంట నియోజవకర్గం నుంచి టికెట్ సంపాయించడం తెలిసిందే. ఇక, కాలం కూడా కలిసి వచ్చి జగన్ కేబినెట్లో వెనువెంటనే బెర్త్ కూడా దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయన వ్యవహార శైలిపై ఇప్పటికే మంత్రుల నుంచి జిల్లా నేతల వరకు కూడా అనేక ఫిర్యాదులు సీఎం జగన్ కు చేరిపోయాయి.నిజానికి రంగనాథరాజు.. రైస్ మిల్లింగ్ రంగంలో లబ్ధప్రతిష్టులు కాబట్టి ఆయన దృష్టంతా కూడా పౌర సరఫరాల శాఖపైనే ఉంది. దీనిని దక్కించుకోలేక పోయాననే ఆవేదన ఆయనలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎప్పుడు అవకాశం వచ్చినా.. ఆయన ఈ రంగంలో వేలు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఈ శాఖకు మంత్రిగా ఉన్న కొడాలి నాని అనేక సందర్భాల్లో విమర్శించారు. నీ పనేంటో నువ్వు చూసుకో అంటూ ఆయనపై విమర్శలు కూడా చేశారన్న చర్చలు వైసీపీ వర్గాల్లోనే ఉన్నాయి.ఇక, జిల్లాలోని కొందరు నేతలు ఎదిగితే. . రాబోయే ఫ్యూచర్లో తనకు ఇబ్బందులేనని భావించే రంగనాథరాజు.. వారి ఎదుగుదలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా పితాని సత్యనారాయణ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను రంగనాథరాజే అడ్డుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఇక నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన వేలు పెడుతూ అక్కడ నాయకులకు ఇబ్బందిగా మారారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే ఉన్నాయి. జగన్ పలుసార్లు అన్నా ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని సుతిమెత్తని సూచనలు చేసినా రంగనాథరాజు తీరు మారలేదనే అంటున్నారు.దీంతో ఈ మొత్తం వ్యవహారం కూడా జగన్ చెంతకు చేరిపోయింది.ఇవన్నీ ఇలా ఉంటే.. మంత్రులను ఎంపిక చేసుకునే సమయంలోనే జగన్ చెప్పినట్టు రెండున్నరేళ్ల తర్వాతఇప్పుడున్న కేబినెట్ మారిపోతుంది. అయితే, వీరిలో కొందరిని తప్పించే అవ కాశం లేదు. కారణాలు ఏవైనా కానీ.. కొందరిని జగన్ తప్పించలేని పరిస్థితి ఉంది. ఇలాంటివారిలో తాను కూడా ఉండాలనేది రంగనాథరాజు ఉద్దేశం. కానీ, ఇదే జిల్లాకు చెందిన ముదునూరి ప్రసాదరాజును తలుచుకున్నప్పుడల్లా రంగనాథరాజుకు నిద్ర పట్టడం లేదు. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, పార్టీ కోసం ఎంతో కృషి చేసిన ప్రసాదరాజును వచ్చే మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చింగా సీటు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పటికే క్షత్రియ వర్గానికి చెందిన రంగనాథరాజు ఉండడంతో ప్రసాదరాజుకు ఇవ్వడం కుదురుతుందా ? అన్న ప్రశ్నకు ఖచ్చితంగా ఎస్ అనే అంటున్నాయి వైసీపీ వర్గాలు. పైగా రంగనాథరాజుపై సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను తప్పించడం ఖాయమని అంటున్నారు స్థానిక నాయకులు. ఈ పరిణామమే రంగనాథ రాజకు నిద్ర కూడా పట్టనివ్వడం లేదు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.