ముంబైలో 144 సెక్షన్
ముంబై, మే 5,
ముంబై నగరంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలో మే 17 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. వైద్యం కోసం మినహా మరే ఇతర పనుల కోసం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రోడ్డెక్కొద్దని ఉద్ధవ్ సర్కారు సూచించింది. నిబంధనలను అతిక్రమించిన వారు ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య కేవలం మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వాహనాలు మాత్రమే రోడ్డు ఎక్కడానికి అనుమతి ఇస్తారు.దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 17 వరకు పొడిగిస్తూ మోదీ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపుల మేరకు స్థానికంగా కొన్ని మద్యం దుకాణాలను తెరవడంతో.. పరిస్థితి గందరగోళంగా మారింది. నగరవ్యాప్తంగా జనం లిక్కర్ కోసం బారులు తీరారు. సోషల్ డిస్టెనింగ్స్ నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో ముంబై నగరంలో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది.మహారాష్ట్రలో 14,541 కరోనా కేసులు, 796 మరణాలు నమోదు కాగా.. ముంబై నగరంలోనే 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 361 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే దేశ ఆర్థిక రాజధానిలో 150 కొత్త కేసులు నమోదయ్యాయి.