ఏమరుపాటుగా ఉంటే ప్రకృతి సంపదను కొల్లగొట్టే అక్రమార్కులు రెచ్చిపోతున్న రోజులువి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడంలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలోనే ఈ తరహా మట్టి తవ్వకాలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి సంబంధించిన మాన్యం భూముల్లోని మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మట్టి, రాళ్లను ఎవరు పడితే వారు తరలించుకుపోతున్నారని స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్ మొరం మట్టిని రూ.300 నుంచి రూ.500లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా రాత్రి పూటే అధికంగా సాగుతున్నట్లు సమాచారం. రాత్రి సమయాల్లో దాదాపు వంద ట్రిప్పులను తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
లక్ష్మీనారాయణస్వామి ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైనట్లు చరిత్ర చెప్తోంది. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పునరుద్ధరించింది. దీని కోసం రూ.25లక్షలు వెచ్చింది. ప్రస్తుతం ఆలయంలో నిత్యపూజలు కొనసాగుతున్నాయి. విలువైన భూములన్నా వాటి నుంచి ఆదాయం సమకూరని పరిస్థితులున్నాయి. కొన్ని భూములను కౌలుకు ఇచ్చినా ఫలితంలేదు. దీంతో ఆలయ నిర్వాహణ ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు ఆలయ భూముల్లో అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ మట్టిని తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. భూముల్లోని గుట్టలను పగుల గొట్టేందుకు పేలుళ్లు కూడా జరుపుతున్నారు. రాళ్లను కంకరగా మార్చి అమ్మకానికి పెడుతున్నారు. ఈ తరహా అమ్మకాలకు ఎలాంటి అనుమతులు లేవు. గుట్టలను కొల్లగొడుతున్నా అధికారులు విర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తరచూ పేలుళ్లు జరుపుతుండడంతో భయాందోళనల మధ్య గడుపుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారయంత్రాంగం స్పందించి ఈ తరహా అక్రమాలకు తెరదించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.