విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి,ప్రదాని విచారం
న్యూఢిల్లీ మే 7
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్లో రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్ఘటన వివరాలను సీఎం జగన్ ప్రధానమంత్రికి వివరించారు. తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. తాజా ప్రమాదంపై చర్చించేందుకు జాతీయ విపత్తు నివారణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. సహాయ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై సమీక్షిస్తున్నారు.
==========================