శ్రీకాంత్ రెడ్డికి ఇంటిపోరు
కడప, మే 8
కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గానికి పెద్ద ప్రాధాన్యమే ఉంది. ఇక్కడ నుంచి గతంలో సుగవాశి పాలకొండ్రాయుడు నాలుగు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఆయన రికార్డును బద్దలు కొట్టిన నాయకుడు ఎవరూ లేరు. అయితే, 2009 నుంచి వరుసగా విజయం సాధిస్తున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏమైనా ఈ రికార్డును బద్దలు కొడతారా? అంటే.. నిన్న మొన్నటి వరకు తనకు తిరుగులేదని భావించిన శ్రీకాంత్ రెడ్డికి ఇప్పుడు నియోజకవర్గంలో నేరుగా ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుండడం ఒకింత ఇబ్బందిగానే పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు.విషయంలోకి వెళ్తే.. తన తండ్రి వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి 2009లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ పాలకొండ్రాయుడిని ఓడించారు. కాంగ్రెస్ సభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే, తర్వాత వచ్చిన రాజకీయ కుదుపు నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి మద్దతిచ్చారు. తర్వాత కాంగ్రెస్తో విభేదించి వైసీపీలోకి వచ్చేశారు. ఇక, 2012లో వచ్చిన ఉప పోరులో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాదించారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ శ్రీకాంత్రెడ్డి విజయం సాధించారు.అయితే 2014 ఎన్నికల్లో గెలిచాక జగన్కు ఆయనకు చిన్న గ్యాప్ వచ్చిందన్న టాక్ అయితే వచ్చింది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ వెంటే నడుస్తోన్న ఆయన అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ వలవేసినా శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా వైసీపీలోనే కొనసాగారు. ఇక గత ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చినా ఆయన మంత్రి పదవి కోరిక తీరలేదు. ఆ తర్వాత ఆయన అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారన్న టాక్ కడప జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపించింది. ఎప్పుడైనా వీలుంటే ప్రెస్మీట్ పెడుతున్నారే తప్పా ప్రతిపక్షంలో ఉన్నంతగా బలమైన వాయిస్ వినిపించడం లేదు.ఇదిలా ఉంటే నియోజకవర్గంలో ఇబ్బందులు, ప్రజల సమస్యలు మాత్రం ఇన్నేళ్లలోనూ పరిష్కారం కాలేదనేని ప్రధాన విమర్శ. గడికోట శ్రీకాంత్రెడ్డి.. వరుసగా విజయంసాధించినా.. నియోజకవర్గంలో తాగునీటి సమస్యకాని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో కానీ, ఆయన ఎలాంటి శ్రద్ధా తీసుకోలేదు. గతంలో ఆయా సమస్యలపై ప్రజలు ప్రశ్నించినప్పుడు పార్టీ అధికారంలో లేదని చెబుతూ వచ్చారు శ్రీకాంత్రెడ్డి. మరి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు అంటూ ఏమీ లేకపోవడంతో ప్రజలు మరోసారి ఆయనకు ప్రశ్నలు సంధిస్తున్నారు.రాయచోటిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇది మరింత తీవ్రమైంది. ఇక సాగునీటి సమస్యతో పాటు నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న వలస కార్మికుల కట్టడిపై దృష్టి లేదు. అయితే, ఇప్పుడు ఆయనకు నిజానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు.. కానీ, అంతర్గతంగా ఆయన ఇబ్బం దుల్లో ఉన్న మాట వాస్తవమే. పార్టీ అధికారంలోకి వచ్చినా..తన మనసులో కోరిక మాత్రం నెరవేరలేదు. దీంతో ఆయన మౌనంగా ఉంటున్నారు. అయితే, ఇది స్థానికంగా ప్రజలకు శాపంగా పరిణమించింది. దీంతో ఇప్పుడు రాయచోటిలో ప్రజల అసంతృప్తి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి కనీసం నియోజకవర్గంలో కీలక సమస్యలు అయినా పరిష్కరించడంపై దృష్టి పెడతారేమో ? చూడాలి