YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డి టార్గెట్ గా టీడీపీ

విజయసాయిరెడ్డి టార్గెట్ గా టీడీపీ

విజయసాయిరెడ్డి టార్గెట్ గా టీడీపీ
విజయవాడ, మే 8
రాజకీయం అంటేనే కరకుగా ఉంటుంది. మంచికి, మానవత్వానికి ఎక్కడా స్థానం ఉండదు. అది పాతికేళ్ళ క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అధికార మార్పిడి బాగోతం రుజువు చేసింది. ఇక నమ్మిన బంటులే వెన్నుపోటు పొడుస్తారు అనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే అరుదుగా బంధాలకు, విశ్వాసాలకు కట్టుబడిన నాయకులూ కనిపిస్తారు. తమిళనాడులో జయలలిత, శశికళల బంధం అలాంటిదే. వారిద్దరి మధ్యన ఎపుడూ పొరపొచ్చాలు లేవు. జయలలిత మరణించేదాకా ఆమెనే నమ్మారు. ఇక ఏపీలో చూసుకుంటే జగన్, విజయసాయిరెడ్డిల మధ్య సాన్నిహిత్యాన్ని అంతా చెప్పుకుంటారు. ఓ విధంగా జగన్ నీడలా కూడా విజయసాయిరెడ్డిని అభివర్ణిస్తారు.ఏ యుధ్ధమైనా ఎదురుగా నిలబడి ప్రత్యర్ధి మీద బాణాలు వేస్తారు. అలా గెలిచిన వాడే నీతికి కట్టుబడిన నేతగా, విజేతగా చెప్పుకుంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఈ సూత్రం పూర్తిగా ఉల్టా సీదాగా ఉంటుంది. ఎదురుగా ఢీ కొడితే ఫలితాలు రావు అనుకుంటే పక్కన చేరి మరీ దెబ్బతీస్తారు. లేకపోతే పక్కవారిని చేరదీసి మరీ విభీషణులుగా మార్చి తమ రాజకీయాలకు వాడుకుంటారు. ఇపుడు ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే చిచ్చు రాజుకుంటోంది. వైసీపీ బంపర్ మెజారిటీతో గెలవడం టీడీపీకి మింగుడుపడడంలేదు. అన్నింటికీ మించి తమకు 23 సీట్లు రావడం అవమానంగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే తమకు మాత్రమే గుత్తాధిపత్యంగా ఉన్న సీఎం కుర్చీని వైసీపీ తన్నుకుపోయిందన్న బాధ, ఆక్రోశం టీడీపీలో అడుగడుగునా కనిపిస్తున్నాయి.జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య గొడవ పెట్టాలని కొంతకాలంగా టీడీపీ, దాని అనుకూల మీడియా చూస్తున్నాయని ప్రచారంలో ఉంది. సూపర్ సీఎం మాదిరిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడు అని తమ్ముళ్ళు గుండెలు బాదుకోవడం వెనక జగన్ లో కొత్త అనుమానాలు పుట్టించాలన్నదే ఉద్దేశ్యమని అంటారు. ఇక అంతటితో ఆగని విధంగా అనుకూల మీడియా కూడా తన రాతల్లో ఈ మధ్య విజయసాయిరెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది. విజయసాయిరెడ్డికే పాలనపైనే కాదు, అనేక విషయాల్లో పరిపక్వత ఉందని రాతలు రాయడం వెనక కూడా సరికొత్త వ్యూహం ఉందని చెబుతారు.తాజాగా జగన్ విశాఖ టూర్లో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా మంత్రి ఆళ్ల నానిని తన వెంట విమానంలో తీసుకువెళ్లాడని టీడీపీ అనుకూల వర్గం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. జగన్ కి విజయసాయిరెడ్డి మీద నమ్మకం తగ్గిందని, అందుకే ఆయన్ని అనుమానిస్తున్నారని కూడా ఆ పొస్టుల్లో రాసుకొస్తున్నారు. అయితే దాని మీద‌ ఆళ్ల నాని వెంటనే ఖండించారు కూడా. సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశ్యంతోనే సీట్లు చాలకే తనకు అవకాశం ఇస్తూ విజయసాయిరెడ్డి తనకు తానుగానే విశాఖ టూర్ మానుకున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్, విజయసాయిరెడ్డిల మధ్య బంధం గట్టిదని, అలాంటి ఒక్క నేతను టీడీపీలో చూపించాలని ఆయన సవాల్ చేశారు. మొత్తానికి జగన్ నుంచి విజయసాయిరెడ్డిని విడదీసి బలహీనం చేయలన్న ఎత్తుగడ ఏదో ప్రత్యర్ధి శిబిరంలో ఉన్నట్లుగా ప్రచారమైతే సాగుతోంది. మరి వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి విషయంలో ఈ వ్యూహాలు, ఎత్తుగడలు ఎంతవర‌కూ పారుతాయో కాలమే చెప్పాలి.

Related Posts