YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఈ జగమే మాయ

ఈ జగమే మాయ

ఈ జగమే మాయ
'బ్రహ్మ సత్యం - జగన్మిథ్య' బ్రహ్మమొక్కటే సత్యమైనది.శాశ్వతమైనది.ఈ జగత్తు అంతా మిథ్య అంటే మాయ.
తనకు మాయను చూపించమని నారదుడొకసారి శ్రీకృష్ణుని అడిగేడు.ఒకరోజు శ్రీకృష్ణుడు నారదుణ్ణి తన వెంట రమ్మన్నాడు.కొంత దూరం నడచిన తర్వాత " నారదా! నాకు దాహం వేస్తుంది.కొంచెం మంచినీళ్ళు తీసుకురా." అన్నాడు శ్రీకృష్ణుడు. అలాగే అని తేవడానికి బయలుదేరేడు నారదుడు.దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టేడు. జగన్మోహనాంగి అయిన ఒక యువతి తలుపు తెరిచింది.ఆమెను చూడగానే నారదుడు శ్రీకృష్ణుడు దాహంతో మంచినీళ్ళ కోసం వేచి ఉన్నాడన్న మాటే మర్చిపోయి ఆ యువతితో సల్లాపాలాడుతూ కూర్చున్నాడు.ఆ రోజంతా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళలేదు.మర్నాడు కూడా మళ్ళీ వచ్చి సరస సల్లాపములతోనే కాలం గడిపేడు. అలా ఇష్టా గోష్ఠులు సాగి వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమలో పడి ఆ యువతి తండ్రి అనుమతితో పెళ్లి చేసుకుని పిల్లలను కన్నారు.పన్నెండేళ్ళు గడిచేయి.మామ మరణించేడు.ఆస్తి అంతా వారికి సంక్రమించింది.భార్యా బిడ్డలూ,భూములూ,పశువులూ మొదలైన సకల సంపదలనూ అనుభవిస్తూ నారదుడు చాలా సుఖజీవనం చేస్తున్నాననుకున్నాడు. ఇలా ఉండగా దగ్గరలో ఉన్న నది ఒకటి పొంగి మహాప్రవాహమై గ్రామాన్ని ముంచివేసింది.నారదుడు ప్రాణాల్ని దక్కించుకోవడానికి పారిపోవలసివచ్చింది.భార్యను ఒక చేత్తో,ఒక బిడ్డను ఇంకో చేత్తో పట్టుకుని భుజాల మీద ఇద్దరు పిల్లల్నీ ఎక్కించుకుని ఆ మహాప్రవాహాన్ని దాటుతున్నాడు. కాని ఆ ప్రవాహపు ఉద్ధ్రుతికి పట్టు తప్పి చేతుల్లో ఉన్న భార్యా,బిడ్డా జారిపోయి కొట్టుకునిపోయేరు.వారిని కాపాడుకునే ప్రయత్నంలో భుజాలపై ఉన్న ఇద్దరు బిడ్డలు కూడా యావచ్చక్తితో పట్టుకుని ఉన్నా కూడా ప్రవాహంలో పడిపోయేరు.నారదుడు గట్టు మీద పడి ఘోరశోకావేశాపరుడై ఏడుస్తూ మొత్తుకుంటున్నాడు.ఇంతలో వెనుకనుంచి " నారదా! ఏవీ మంచినీళ్ళు? తెస్తానని వెళ్ళేవు. నీ రాక కోసం నిరీక్షిస్తున్నా.అరగంట దాటింది." అన్న మాటలు వినబడ్డాయి." అరగంటేనా కృష్ణా!" అని నారదుడు ఆశర్యంతో అన్నాడు.అతని మనసులో పన్నెండేళ్ళు గడిచేయి.కాని ఆ చరిత్ర అంతా జరిగింది అరగంటలోనే. “నారదా! ఇదే మాయ అంటే.చూపించమన్నావు కదా!అనుభవం అయిందా?" అని అడిగేడు శ్రీకృష్ణుడు. మానవుడు నిత్యం భగవంతుని మాయావిలాసానికి అబ్బురం చెందుతూనే వ్యామోహపీడితుడు అవుతున్నాడు.ఒక్కోసారి మాయనుండి విడివడి వైరాగ్యాన్ని పొందుతున్నాడు కాని అది పురాణ వైరాగ్యమో, స్మశాన వైరాగ్యమో అయి తిరిగి బురదకుంటలో వరాహం లాగా,శ్లేష్మంలో ఈగ లాగా సంసారమనే కూపంలో పడి కొట్టుకుంటున్నాడు.అందుకే నిజమైనజ్ఞానాన్ని ప్రోది చేసుకోవాలి.గురువులు చెప్పే ఉపన్యాసాలలోని అంతర్లీనమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి.తనవారి పైన కాని,తనవనుకునే వస్తుసంచయాలపైన గాని వ్యామోహం పెంచుకోకూడదు. సంతానం వల్లగాని,సంపదవల్లగాని అమృతత్వాన్ని పొందలేము.ఈ లోకంలో కనిపించే ప్రతిదానికీ నాశనమయ్యే తత్త్వం ఉంటుంది.మానవులకు సంబంధించిన వస్తు నిక్షేపాలు ఎంత గొప్పవైనా అవి అన్నీ ఒకనాటికి నశించేవే.ఎప్పటికీ నిలిచిఉండే వస్తువంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ప్రతి వస్తువు గురించీ మానవుని అంతర్లీనంగా ఓ భయం ఆవరించి ఉంటుంది.ఆ వస్తువు చేయి జారినప్పుడు అంతులేని వ్యథకు లోనవుతుంటారు.అటువంటి వ్యథ లేనిది ఎప్పటికీ నశించనిది భగవంతుని తత్వమొక్కటే.అందుకే భగవంతుని గూర్చిన జ్ఞానం తెలుసుకుని తీరవలసినదే.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో           

Related Posts