కర్నులు జిల్లాలో బీటీ–3 పత్తి విత్తనాల దందా జోరందుకుంది. నకిలీ విత్తనాలు రైతన్నలను నట్టేట ముంచుతున్నాయి. ఎన్నడూ లేనంతగా నకిలీ విత్తనాలతో రైతులు అప్పులపాలయ్యారు. రెండో పంట పండించే అవకాశం కూడా లేకపోవటంతో నష్టపరిహారం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు రైతులు. నకిలీ విత్తనకంపెనీలపై చట్టపరమైన చర్యలతో చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం,. రైతన్నలను ఆదుకోవడంపై మాత్రం దృష్టిసారించటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల వ్యవసాయశాఖాధికారులు ఆదోనిలోని వివిధ విత్తన దుకాణాల్లో తనిఖీలు జరిపి బీటీ–2 ముసుగులో బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. బీటీ–2 పేరుతో బీటీ–3 విత్తనాలు ఉన్న ప్రో సీడ్, సాయి భవ్య( నూజివీడు), మై సీడ్ కంపెనీలకు చెందిన 384 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ విత్తన విక్రయం ఆదోనిలో ఒక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. బీటీ– 3ని ట్రయల్ రన్గా నిర్వహించేందుకు విత్తన కంపెనీలు అక్రమ మార్గాల్లో వాటిని మార్కెట్లోకి తెస్తోన్నాయి. అయితే వ్యాపారులు మాత్రం కమర్షియల్ పత్తి సాగుకు బీటీ–2 పేరుతో ఉన్న బీటీ–3 విత్తనాలనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీవవైవిధ్యానికి, పర్యావరణానికి హానికరమని కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తున్నా కార్పొరేట్ కంపెనీలు పట్టించుకోకుండా కర్నూలు జిల్లాను బీటీ–3 విత్తన ప్రయోగశాలగా మార్చి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.గతేడాది జిల్లా వ్యాప్తంగా 10వేల హెక్టార్లలో బీటీ– 3 పత్తి విత్తనాలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. బీటీ–2 పేరుతోనే ఆ విత్తనాలను రైతులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఆ విత్తనాలను గుర్తించలేక చాలా మంది రైతులు వాటిని సాగు చేసి ఇబ్బందులు పడ్డారు. బీటీ– 1లో పచ్చపురుగును తట్టుకునే జన్యువు ఉంటే బీటీ–2లో పొగాకు లద్దెపురు, గులాబీరంగు పురుగును తట్టుకునే జన్యువు ఉంటుంది. అదే బీటీ–3లో ప్రమాదకరమైన గ్లైపోసేట్ కలుపు మందు జన్యువు ఎక్కిస్తారు. ఈ విత్తనం సాగు తర్వాత రైతులు పంటలో కలుపు నివారణకు గ్లెసెల్ కెమికల్ మందును విచ్చలవిడిగా వాడటంతో విష ప్రభావానికి గురయ్యారు.ఫలానా విత్తనాలనే వాడండి. అధిక దిగుబడులు పొందండి అంటూ ప్రభుత్వం చేసిన విస్తృత ప్రచారానికి అన్నదాతలు బలైపోయారు. విత్తనాల వాడకంతో నిండా మునిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా తాలు ఉండటంతో.. దిక్కుతోచని స్థితిలో రైతులు లబోదిబోమంటున్నారు.