ఆగస్టు 31వ తేదీలోగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు
హైదరాబాద్ మే 09
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆగస్టు 31వ తేదీలోగా తీర్పును ఇవ్వాలని ప్రత్యేక సీబీఐ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బీజేపీ, వీహెచ్పీ సీనియర్ నేతలు నిందితులుగా ఉన్నారు. జస్టిస్ ఫారీమన్, సూర్య కంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. లక్నోలోని ట్రయల్ కోర్టు జడ్జి.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా త్వరగా కేసును విచారించాలని సుప్రీం పేర్కొన్నది. అయితే కొత్తగా ఇచ్చిన డెడ్లైన్ దాటకుండా ట్రయల్ కోర్టు జడ్జి అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. ఈ కేసులో మొత్తం 32 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వారిలో అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కళ్యాణ్ సింగ్, మాజీ మంత్రి ఉభా భారతి, బ్రిజ్ భూషణ్ సింగ్, సాక్షీ మహారాజ్లు ఉన్నారు. 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అయోధ్యలో రెండు కేసులను నమోదు చేశారు. ఒకటి బాబ్రీ మసీదు కుట్రకు సంబంధించినది కాగా, ప్రజల్ని రెచ్చగొట్టిన అంశంలో రెండవ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మరో 47 కేసులు నమోదు కాగా, వాటిని అన్నింటినీ ఒక కేసుగా కలిపేశారు.