మమతాబెనర్జీకి అమిత్ షా ఘాటు లేఖ
న్యూఢిల్లీ మే9
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఘాటు లేఖ రాశారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి కేంద్రానికి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ అమిత్ షా ఆరోపించారు. దేశంలో 2 లక్షల మంది వలసకార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం సదుపాయం కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చిక్కుకు పోయిన వలసకార్మికులు కూడా వారి స్వస్థలాలకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారని, కాని పశ్చిమ బెంగాల్ సర్కారు వలసకార్మికులను తరలించేందుకు రైళ్లను అనుమతించడం లేదని అమిత్ షా ఆరోపించారు. దీని వల్ల వలసకార్మికులు మరింత అవస్థలు పడుతున్నారని కేంద్రమంత్రి సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా సంక్రమణ నుంచి మృతుల దాకా కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. కాగా ప్రజారోగ్య సంక్షోభాన్ని కేంద్రం రాజకీయం చేస్తుందని పశ్చిమబెంగాల్ ఆరోపిస్తోంది.