వార్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న అఖిలపక్షం సమావేశానికి నటుడు శివాజీ హాజరయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా అమరావతిలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అఖిలపక్ష సంఘాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, శివాజీ, సచివాలయ, ప్రభుత్వ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, జనసేన ఈ సమావేశానికి హాజరుకాలేదు.గత అఖిలపక్ష సంఘాల సమావేశానికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను రాలేకపోయానని చెప్పారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అపరేషన్ గరుడ అనేది నిజమేనని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఈ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. జాతీయ పార్టీల ఉచ్చులో కొన్ని పార్టీలు పడుతున్నాయని అన్నారు. ఐదు కోట్ల ప్రజలు ఎన్నుకున్న ఓ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, దీనికి అన్నిరాజకీయ పార్టీలను ప్రభుత్వం ఆహ్వానించిందని అన్నారు. మొన్న జరిగిన అఖిలపక్షానికి కొంతమంది వచ్చారని, ఇవాళ మరికొంతమంది రాలేదని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పిలిచినప్పుడు వాళ్లు రాకపోతే... అది ప్రజలు ఆలోచిస్తారని శివాజీ అన్నారు.కార్యాచరణకు సంబంధించి తాను ముఖ్యమంత్రిని అడుగుతానని శివాజీ స్పష్టం చేశారు. తనకు ఏ పార్టీ పట్ల ప్రేమ గానీ, ద్వేషం గానీ లేదన్నారు. ఈ సమావేశానికి కొన్ని రాజకీయ పార్టీలు రాకపోవడం తప్పేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని శివాజీ స్పష్టం చేశారు.
ఆపరేషన్ గరుడ కొనసాగుతోంది