విమర్శలకే కమల నేతల పరిమితమా
గుంటూరు, మే 12
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, అందుకే రాష్ట్రంలో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక, రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనా రాయణ ఏకంగా.. కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి జరిగిందని, సీఎం జగన్ ఆయన పరివారం అదును చూసి అవినీతికి పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. చేస్తున్నారు.దీనిపై పెద్ద వివాదమే చోటు చేసుకుంది. అయినా కూడా ఆయన తన ఆరోపణలు ఆపడం లేదు. అంతే తప్ప.. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడిన బీజేపీ నాయకులు ఒక్కరూ కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించాల్సిందే. అయితే, అదే సమయంలో ఒక జాతీయ పార్టీగా మాత్రం.. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఇంతకన్నా బాధ్యత లేదా ? ప్రజల పక్షాన నిలిచే క్రమంలో కేవలం ఆరోపణలు, విమర్శలకే పరిమితం అవుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మేధావుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. నిజానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో కేంద్రానికి లేఖలు రాయడమో.. ఫోన్లు చేయడమో చేసి రాష్ట్ర ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువగా సాయం చేసే బాధ్యత బీజేపీ నేతలు ఎందుకు తీసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులు కూడా ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి, టీజీ వెంకటేష్ తదితరులు బీజేపీ కండువా కప్పుకొన్నారు. వీరంతా ఎంపీలుగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా నానా హడావిడి చేసే ఈ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు. నాడు పార్టీ ఎందుకు మారారంటే.. రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఇదే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే.. కనీసం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోనీ.. రాష్ట్రం మొత్తానికి కాకపోయినా.. వారి వారి సొంత జిల్లాలకైనా తమ వంతు సాయం చేయొచ్చు చేయించొచ్చుకదా?! అనే ప్రశ్నకు వారుసమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.పేరుకు వీళ్లంతా బీజేపీ ఎంపీలుగా ఉన్నా కేంద్రంలో ఏ మాత్రం పట్టులేదని వీరిని పరిశీలిస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం దగ్గర పలుకుబడి సత్తా ఉంటే.. కనీసం ఇప్పటికైనా వారు స్పందించాలనేది ప్రజల డిమాండ్. మరి ఇప్పటికైనా నాయకులు స్పందిస్తారా? లేదా? చూడాలి.