YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మసక బారుతున్న గాజువాక నియోజకవర్గం

మసక బారుతున్న గాజువాక నియోజకవర్గం

మసక బారుతున్న గాజువాక నియోజకవర్గం
విశాఖపట్టణం, మే 12
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అందరి దృష్టిని ఆకట్టుకున్న శాసనసభ నియోజకవర్గాల్లో విశాఖ అర్బన్ జిల్లాలోని గాజువాక ఒకటి. దీనికి అంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం. పవన్ నామినేషన్ కి వెల్లువలా జనం హాజరయ్యారు. దాంతో ఆయన గెలుపు ఖాయమని నాడు అభిమానులు అంచనా వేశారు. అదే సమయంలో వైసీపీ, టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు జనాలను అరువు తెచ్చుకోవాల్సివచ్చింది. మొదట్లో పవన్ కల్యాణ‌్ ఊపు అలా ఇలా లేదు, అలాంటిది జనసేనాని అతివిశ్వాసంతో పాటు టీడీపీ చేసిన తప్పుల కారణంతో వైసీపీకి బాగా అడ్వాంటేజి అయింది. మరో వైపు జగన్ గాజువాక సభ కూడా సీన్ మొత్తం మార్చేసి రియల్ హీరోగా ఉన్న వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డిని అసెంబ్లీదాకా పంపించింది.అన్నింటికంటే పెద్దాయన, అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసిఓడిపోతున్నాడు, అందరికీ సన్నిహితంగా ఉంటాడు అన్నవి బాగా ఎన్నికల్లో పనిచేసి నాగిరెడ్డికి పట్టం కట్టాయి. అంటే పవన్ కల్యాణ్ సినీ గ్లామర్ మీద నాగిరెడ్డి సానుభూతి అస్త్రం బాగా పనిచేసిందన్నమాట. వాస్తవాలు ఇలా ఉంటే గెలిచిన తరువాత వైసీపీ పెద్దలు నేల విడిచి సాము చేస్తున్నారు. తమకు గాజువాకలో బలం ఎక్కువగా ఉందని, టీడీపీ, జనసేనలను ఒక్క దెబ్బకు ఓడించామని సంబరపడుతున్నారు. దీనికి తోడు వర్గ విభేదాలు ఇపుడు పెరిగి పెద్దవిగా మారుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంతో ఏడాదిలోనే వైసీపీ గాజువాకలో జనాలకు దూరమవుతోంది అంటున్నారు.ఇక స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి కానీ లేకపోతే ఈ పాటికే గాజువాకలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు కొన్ని విరిగేవని కూడా సొంత పార్టీలోనే మాట గట్టిగా వినిపిస్తోంది. గాజువాకలో పెద్ద నాయకులు అంతా వైసీపీలో ఎన్నికలకు ముందు చేరిపోయారు. వారి మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని సరిచేసుకోలేక ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతులెత్తేశారు. మరో వైపు చూసుకుటే జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా తన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాంతో తిరుగుబాట్లు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే వైసీపీ విజయావకాశాలను సొంత పార్టీ నేతలే దెబ్బ తీసేలా సీన్ కనిపిస్తోంది.నాగిరెడ్డి తరువాత ఎవరు అన్న ప్రశ్న వస్తే తన కుమారుడే వారసుడు అని ఎమ్మెల్యే చెప్పేసుకుంటున్నారు. అంతే కాదు, తన కొడుకు దేవాన్ష్ రెడ్డికి కార్పోరేటర్ టికెట్ ఇచ్చి మరీ రేపటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం తయారు చేసి పెట్టారు. ఇక ఆయనతో పడక టీడీపీలోకి వెళ్ళిన సన్నిహిత బంధువు, అబ్బాయి వరస అయిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి మళ్ళీ వైసీపీ గూటిలో చేరారు. 2024 నాటికి తానే ఎమ్మెల్యే అభ్యర్ధి అని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ లీడర్ గా ఉన్న మంత్రి రాజశేఖర్ సైతం గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన‌కు విశాఖ ఎంపీ టికెట్ ని కాంగ్రెస్ ఇచ్చింది. అయినా వైసీపీలో చేరి నాగిరెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఇపుడు తనకేంటని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తూంటే గాజువాకలో ఫ్యాన్ జోరు బాగా తగ్గిందని అంటున్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి అందరినీ కలుపుకుని పోవడంలేదని, తన కుటుంబానికే ఆయన పనిచేస్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో రియల్ హీరో గ్లామర్ కరిగిపోతోందని అంటున్నారు.

Related Posts