బాబు కన్నా కామ్రేడ్లే..బెటరా
హైద్రాబాద్, మే 12
ప్రతి దానికీ.. ఎడ్డం అంటే తెడ్డెం అనే నాయకులుగా పేరు తెచ్చుకున్న ది గ్రేట్ కామ్రెడ్స్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తీసు కుంటున్న నిర్ణయాలతో పనిలేకుండా పోయి.. ఇంటికే పరిమితమయ్యారు. అమ్మ ఒడి సహా పేదలకు ఇళ్ల పంపిణీ, రైతు భరోసా, స్థానికంగా 70 శాతం మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు వంటి సంచలన నిర్ణయాలతో వారు మౌనం పాటిస్తున్నారు. జగన్ను విమర్శించేందుకు వారికి ఉన్న ఏకైక ఆయుధం ఏదైనా ఉంటే.. రాజధాని మార్పు. దీనిని పట్టుకుని కొన్ని రోజులు వేల్లాడినా సీపీఎం నేతలకు కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన సమాచారంతో దీని నుంచి కూడా వారు దూరమయ్యారు. ఇక, సీపీఐ మాత్రం మేం పోరాడతాం.. అంటూ.. ఏదో కనిపించీ కనిపించని విధంగా పోరాటం చేస్తోంది.ఇక, తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించిన తీరుకు కామ్రేడ్లు సైతం ఫిదా అయ్యారు. ఇంతక న్నా ఏ సీఎం అయినా ఏం చేస్తారని.. సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక, రాష్ట్ర చీఫ్ రామకృష్ణ కూడా ఏమీ విమర్శలు చేయలేదు. అదే సమయంలో జగన్ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంతో కామ్రేడ్లకు నోట మాటలేదు. ఇది ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కూడా ఇవ్వని పరిహారం. నిజానికి లోపాలను వెతకడంలో కామ్రేడ్లను మించిన నాయకులు, విమర్శలు చేయడంలో ఈ పార్టీకి మించిన పార్టీ, పోరాటాలు చేయడంలో ఎర్రజెండాను మించిన జెండా లేదు. వారే.. జగన్ పాలన చూసి మౌనం వహిస్తున్నారంటే జగన్ పాలనను వారు నిశితంగా గమనిస్తూ విమర్శలు చేస్తున్నారన్నది అర్థమవుతోంది.కానీ, కామ్రేడ్లతో చెలిమి చేస్తానని పదే పదే చెప్పుకొంటున్న (ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత) టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కనీసం వారు ఆలోచిస్తున్న విధంగా కూడా ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ బాధితులకు రూ.కోటి ఇస్తే.. దీనిని కూడా విమర్శించేందుకు చంద్రబాబు వెనుకాడలేదు. డబ్బులు ఇస్తే.. సరిపోదు.. అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వం స్పందించడం కాదు.. పరిశ్రమ స్పందించేలా చేయాలని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఏ ఘటన జరిగినా.. ముందు స్పందించేది ప్రభుత్వమే అనే విషయం.. మరి 14 ఏళ్ల ఆయన అనుభవంలో తెలియక పోవడం నివ్వెరపాటుకు గురిచేస్తోంది.చంద్రబాబు పాలనలో ఏర్పేడులో ఇసుక తవ్వకాల నేపథ్యంలో హత్యలు, గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో బాధితులకు ఇచ్చిన పరిహారం తక్కువన్న అభిప్రాయం ఉంది. అది కూడా సరిగా ఇవ్వలేదు. నెలల తరబడి బాధుతుల ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇక ఇప్పుడు విశాఖ అదే సమయంలో కంపెనీ నుంచి వచ్చేదీ రానిది పక్కన పెడితే.. జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించి కోటి నష్ట పరిహారం ప్రకటించింది. వెంటనే చెల్లించింది కూడా. దీనిని కూడా ఏమీ చేయనట్టుగా ప్రొజెక్టు చేయడాన్ని చూస్తే.. చంద్రబాబు కన్నా కామ్రేడ్లు బెటర్ అనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఇప్పటికైనా నిర్మాతాత్మక విమర్శలతో ప్రజల పక్షాన పోరాటం చేస్తే మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంది.