కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన పరంపరాగత్ కృషి వికాస యోజన మార్గదర్శకాలలో కేంద్ర ప్రభుత్వ కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో సేంద్రీయ వ్యవసాయానికి మార్కెట్ అనుసంధానాన్ని సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అమలు చేసుకునే విధంగా వెసలుబాటు కల్పిస్తూ మరియు అపరిమితంగా సేంద్రీయ వ్యవసాయాన్ని అమలు చేయడానికి వీలు కల్పించింది. ఈ మార్పుల అవగాహనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం అయ్యారు. శనివారం తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, హజరయ్యారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తులో అమలు చేయడం, అందరి తక్షణ కర్తవ్యం అని అన్నారు. ఈ మారిన మార్గదర్శకాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే పలు జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా సేంద్రీయ వ్యవసాయంలో విజయ గాథలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న అంశం సేంద్రీయ వ్యవసాయమే అని తెలిపారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలను అన్ని మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అలాగే అవసరమైన సూచనలను ఇవ్వవలసిందిగా వ్యవసాయ అధికారులను కోరారు. మారిన మార్గదర్శకాలకు అనుగుణంగా 2018-19 సంవత్సర కార్యాచరణ నివేదకల ను సత్వరమే పంపాలని అధికారులను ఆదేశించారు.