గ్రామాల్లో ఉపాధి...కేంద్రం ఆఫర్
హైద్రాబాద్, మే 12
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా మంది యువత వారి సొంత గ్రామాలకు తిరిగి వచ్చేశారు. దీంతో ఇంకా కొన్ని నెల్లలు పట్టణాలకు వెళ్లలేపోవచ్చు. కొంత మంది గ్రామాల్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. వీళ్లు ఏదైనా ఉపాధి మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీరికి ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులోఉంది.మోదీ ప్రభుత్వం గ్రామాల్లో స్వయం ఉపాధి పొందాలని భావించే వారికి ఒక స్కీమ్ను అందిస్తోంది. అదే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. గ్రామాల్లో ఈ పథకం కింద సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఉపాధి పొందొచ్చు. ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడానికి రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 75 శాతం అంటే దాదాపు రూ.3.75 లక్షల కేంద్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్యను బాగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందువల్ల ఈ ఆప్షన్ ఎంచుకున్న వారికి మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావొచ్చు. గ్రామాల్లో ఉన్న వారు ఈ స్కీమ్కు అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి.రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి మట్టి కండీషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి సాయిట్ టెస్ట్ చేస్తూ ఉంటాయి. దీని ద్వారా నేలలో ఏ ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. వాటిని భూమికి అందించడం ద్వారా పంట బాగా చేతికి వస్తుంది. ఒక్కో శాంపిల్ టెస్టింగ్కు, హెల్త్ కార్డు జారీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.300 అందిస్తుంది. అయితే చాలా మంది రైతులకు ఈ సేవలు అందుబాటులో లేవు. దీంతో వారు పంట పడిస్తున్నా కూడా ఉత్పాదకత మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.