ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించి, అవసరమైన ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 16న విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఎస్సీఎస్టీల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ పార్లమెంట్ సభ్యులు జివి హర్షకుమార్ తెలిపారు. స్ధానిక రాజీవ్గాంధీ కళాశాలలోని సమావేశపు హాలులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు రక్షణ కవచంగా ఉన్న అట్రాసిటీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ చట్టాన్ని నీరుగార్చే విధంగా ఉందన్నారు. ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి ఎస్సీఎస్టీలంతా పార్టీలకు అతీతంగా ఐక్యతతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాను ప్రస్తుతం ఏపార్టీలో లేనని, 16న నిర్వహించే ఆత్మీయ సదస్సుకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు, అన్ని ఎస్సీఎస్టీ సంఘాల వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రులను కూడా ఈ సభకు పిలుస్తున్నామన్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ సదస్సు జరుగుతుందన్నారు. జడ్జిల నియామకంలో రిజర్వేషన్లు లేకపోవడం, సుప్రీంకోర్టులో ఒక్క ఎస్సీ జడ్జికూడా లేకపోవడం వలనే ఇటువంటి తీర్పు వచ్చిందన్నారు.