ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్ల తరువాత దేశంలో ఏక పక్ష పాలనకు కారకుడైన వ్యక్తి ప్రధానిగా తన ఇమేజ్ను పూర్తిగా దిగజార్చుకుంటున్నాడని ఉత్తరాంధ్ర వేదిక ప్రతినిధి కొణతాల రామకృష్ణ అన్నారు. అమిత్ షా పార్టీని నడుపుతున్నాడా? ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా? అనేది అర్థం కావడం లేదు. అందరం ద్విముఖ వ్యూహంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాయపోరాటానికి కూడా మనం సిద్ధం కావాల్సి వుంది. ఏ పార్లమెంటులో ఈ చట్టాన్ని చేశారో అదే పార్లమెంటులో దాన్ని అమలు చేయాలంటూ అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం దారుణం. విశాఖ రైల్వే జోన్ కోసం ఒరిస్సాకు చెందిన ఎంపీలతో మాట్లాడితే వారికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. రైల్వే జోన్, పోలవరం తదితర అంశాలలో ఒరిస్సా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని మాట్లాడితే కేంద్రం ప్రమేయం లేకుండానే మనకు మనమే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని అయన అన్నారు. ముఖ్యమంత్రి ఒక మెట్లు దిగి ప్రతిపక్షాలను కూడా కలుపుకుని వెళ్లి రాష్ట్రపతిని కలిస్తే బావుంటుంది. ఢిల్లీలో నిరవధిక దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలకు ప్రభుత్వం సంఘీభావం తెలిపితే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని అయన అభిప్రాయపడ్డారు.