YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండు రాష్ట్రాల మధ్య మరో లొల్లి

రెండు రాష్ట్రాల మధ్య మరో లొల్లి

రెండు రాష్ట్రాల మధ్య మరో లొల్లి
హైద్రాబాద్, మే 12,
జగన్ సర్కార్ తీరును తప్పుబట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా ఉన్నాయని.. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం.. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకోవడం ఏపీ చేసిన తప్పిదాలన్నారు కేసీఆర్.ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామన్నారు. గతంలో ఉన్న వివాదాలు, విబేధాలను పక్కన పెట్టి.. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని ఏపీతో స్నేహ హస్తం అందించిందని తెలంగాణ సీఎం అన్నారు.భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవ చూపించానన్నారు కేసీఆర్. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదని.. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామన్నారు.కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతున్నందున సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉందని.. మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలి అన్నారు. కాబట్టి గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలన్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకడుగు ముందుకేసి జీవో కూడా జారీ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.

Related Posts