తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపోరు...
హైద్రాబాద్, మే 13
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఏకపక్షంగా సాగుతూ ఉంటాయి. అంశం ఏదైనా ప్రతిపక్షాలపైన ప్రభుత్వానిది పైచేయి అవుతుంది. కాంగ్రెస్, బీజేపీ అడపాదడపా ప్రజల సమస్యలను లేవనెత్తినా పెద్ద పట్టించుకునే వారు లేరు. మీడియాలోనూ వీరి వాయిస్కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కదు. దీంతో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఆరోణ్యరోదనలుగా మిగిలిపోతూ ఉంటాయి. పైగా ప్రతిపక్షం బలహీనంగా ఉందనే ఒక నిందను కూడా మోయాల్సి వస్తోంది. ఏ చిన్న విమర్శ చేసినా ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరుగుతుంటారు. బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు అంటూ నోటికొచ్చినట్లు తిట్టిపోస్తారు. కేసీఆర్ వ్యూహాలు, బలాలు, వాక్చాతుర్యం ముందు ప్రతిపక్షాల విమర్శలు పెద్దగా వినిపించవు, కనిపించవు. ఇక, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఎక్కువగా సంతృప్తి ఉండటం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతులకు పెద్ద పీట వేస్తుండటంతో ప్రజల్లోనూ టీఆర్ఎస్ పాలన పట్ల నమ్మకం ఉంది. దీంతో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరైన అస్త్రం దొరకడం లేదు.ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఓ అస్త్రాన్ని అందించారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నిలదీసేందుకు అవకాశం కల్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం రెట్టింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని గతంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.రాయలసీమ పంపింగ్ ప్రాజెక్ట్ పేరిట డిజైన్ కూడా పూర్తైందని తెలుస్తోంది. రూ.6,829 కోట్లతో పనులకు ఆమోదముద్ర కూడా పడిందనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు ప్రస్తుత సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేలకు పెంచాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అదనంగా తరలించాలనేది ప్రాజెక్టు లక్ష్యంగా చెబుతున్నారు. అయితే, ఈ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం సైలెంట్గా ఉండటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి శ్రీశైలం నుంచి రోజూ 3 టీఎంసీల నీళ్లు అదనంగా రాయలసీమకు తీసుకువెళ్తే తెలంగాణలో శ్రీశైలంపై ఆధారపడిన లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ జిల్లా నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ వంటి వారు ఆరోపిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నిందిస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముందునుంచీ వివాదంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మించి రాయలసీమకు నీరందించారు. ఈ విషయాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమసారథిగా ఉన్న కేసీఆర్ గట్టిగా నిలదీశారు. వైఎస్సార్ను, అప్పటి కాంగ్రెస్ నాయకులను ఈ విషయమై కేసీఆర్ నిందించేవారు. గత ఎన్నికల్లోనూ పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు వైఎస్ అన్యాయం చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు హారతులు పట్టారని కేసీఆర్ ఆరోపించారు.దీంతో అప్పుడు తమను అంతగా విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎందుకు స్పందించడం లేదని తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయమై టీఆర్ఎస్ స్పందించడం లేదు. అయితే, జగన్తో కేసీఆర్కు సయోధ్య బాగా ఉంది.నీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలూ పరస్పరం సహకరించుకోవాలని, గోదావరి నీటిని కృష్ణకు మళ్లించి రెండు రాష్ట్రాలకు సాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలోచన. మరి, ఇప్పుడు జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుపై తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. అయితే, ఈ అంశంలో తెలంగాణ రాజకీయ రచ్చకు కారణమవుతోంది.