కేసీఆర్తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే జగన్ జీవో 203: డీకే అరుణ
హైదరాబాద్ మే 13
తెలంగాణ సీఎం కేసీఆర్తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. సీఎం కేసీఆర్కు తెలియకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతోందని అనుకోవడంలేదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఆనాడు రక్తం మరిగిపోతుందని మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓ పక్కా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు తరలించాల్సిన 2టీఎంసీలకు బదులు 1టీఎంసీ కి కుదించారు. అదే సందర్భంలో పోతిరెడ్డిపాడు కు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారంటే జగన్ కు , కేసీఆర్ కు మద్య ఉన్న రహస్య ఒప్పందం కుదిరిందని అర్థవుతోంది. పోతిరెడ్డిపాడు కు అదనంగా 3 టీఎంసీల నీటిని తరలించడం వలన మహబుబ్ నగర్ , నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మంలో కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 203కు వ్యతిరేకంగా మాజీ మంత్రి డీకే అరుణ ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని బీజేపీ తప్పు పడ్తోంది. తన స్వార్థం కోసం కేసీఆర్ స్వరాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ కేసీఆర్కు దక్షిణ తెలంగాణపై లేదన్నారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే జగన్ జీవో 203 తీసుకొచ్చారని అరుణ ఆరోపించారు. పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పాలమూరు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. ప్రతిసారీ సెంటిమెంట్ వర్కౌట్ కాదన్నారు. పోతిరెడ్డిపాడు కి నీటిని తరలించడం వలన ఎక్కువ నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానేనని, దక్షిణ తెలంగాణ రైతుల కు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని డీకే అరుణ స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 203పై తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ బోర్డ్, కోర్టుకు వెళ్లడం కంటే ముందు ఏపీ సీఎం జగన్ దగ్గరకు వెళ్లి మాట్లాడి, 203జీఓ రద్దు చేసే విధంగా సీఎం కేసీఆర్ చోరవ తీసుకోవాలన్నారు.