మిషన్ భగీరథ ద్వారా కోటి కుటుంబాలకు మంచి నీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలను తొలగించామని చెప్పారు. హైదరాబాద్లో ఇంటింటికీ నల్ల పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. పేదలు ఆత్మగౌరవంగా బతకాలంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం లో భాగంగా కేటీఆర్ శనివారం మరో 176 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.... పేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇచ్చామని... మిగతా ప్రాంతాల్లోను ఇదే తరహాలో నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో TS అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో పేదలకు కట్టిన ఇళ్ల మాదిరి కాకుండా దేశం మొత్తానికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మోడల్ గా నిలవనున్నాయని కేటీఆర్ అన్నారు. ఏప్రిల్ 2019 నాటికి రాష్టంలో 3లక్షల ఇళ్ళు నిర్మిస్తామని... అందుకోసం 18 వేలకోట్ల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అవుతున్న ఖర్చు కన్నా తెలంగాణాలో ఇందుకోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదిరులు పాల్గొన్నారు.నాచారంలోని సింగం చెరువు తండాలో రూ.13.64 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సింగం చెరువు తండా బస్తీలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులకు 2016 జనవరిలో శంకుస్థాపన జరిగింది. జి+3 పద్ధతిన చేపట్టిన ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ శరవేగంగా పూర్తి చేసింది. మొత్తం 11 బ్లాకుల్లో చేపట్టిన ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చిన్న పిల్లల ఆట వస్తువుల ఏర్పాటు, కంపోస్టింగ్ గుంతల నిర్మాణం, ఎల్ఈడీ లైటింగ్ సౌకర్యాలను కల్పించారు. నాచారం ప్రధాన రహదారి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ వరకు సీసీ రహదారిని సైతం నిర్మించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్రూంలు ఒక హాల్, కిచెన్, రెండు బాత్రూమ్లను నిర్మించారు. మొత్తం 176 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ఈ సింగం చెరువు తండాలో 95 శాతం మంది లబ్ధిదారులు గిరిజనులే .