జగన్ మొండితనమే బలమా
కడప, మే 14
జగన్ మొండోడు. ఎవరి మాట వినరు. పైగా రాజకీయ ప్రయోజనం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు. తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికారంలో ఉన్న అప్పటి సోనియా గాంధీకే ఎదురు నిలిచాడు. జగన్ నైజం తెలిసిన వారెవరికైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు పోడు అన్నది తెలుసు. ఇప్పుడు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలోనూ అదే జరుగుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచుతూ జగన్ తీసుకు వచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమయ్యాయి.రాయలసీమ గొంతు తడవాలంటే పోతిరెడ్డి ప్రాజెక్టు అవసరమని జగన్ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 203 జీవో విడుదల చేసింది. 6,800 కోట్లు కూడా కేటాయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టీఎంసీలను తరలించాలన్నది జగన్ యత్నం. అందుకే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని నలభై వేల క్యూసెక్కుల నుంచి ఎనభై వేల క్యూసెక్కులకు పెంచారు. దీనివల్ల వరద నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల దాహార్తిని తీర్చవచ్చు.అయితే ఇది రాజకీయ అంశంగా మారింది. నిన్న మొన్నటి వరకూ సయోధ్యగా ఉన్న ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో డిఫర్ అవ్వక తప్పని పరిస్థితి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచితే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా జీవోలు తీసుకురావడమేంటని కేసీఆర్ ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.కానీ జగన్ మాట వినేటట్లు లేరు. తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని, అందుకు తగిన ఆధారాలను కూడా జగన్ చూపిస్తున్నారు. కృష్ణా రివర్ బోర్డును కన్వెన్స్ చేయాలని ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ ను జగన్ బోర్డు ముందుకు పంపారు. తమ రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని జగన్ వెంటనే రియాక్ట్ అవ్వడం ఈ ప్రాజెక్టు పట్ల జగన్ ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది. రాజకీయంగా లబ్ది పొందే అంశం కావడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టు వీడే అవకాశం లేదు. మొత్తం మీద పోతిరెడ్డి పాడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వార్ తప్పేట్లు లేదు. దీనిపై ఇరు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కాచుకూర్చుని ఉన్నాయి. తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.