వివాదస్పదంగా జగన్ నిర్ణయం...
విజయవాడ, మే 14,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతారు. అయితే కొన్ని విషయాల్లో ఆయన దూకుడు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. ప్రాంతీయ పార్టీల్లో సహజంగా పార్టీ అధ్యక్షుడిదే ఫైనల్. పార్టీ గెలిచినా, ఓటమి పాలయినా దానికి ఆయనే బాధ్యత వహించాలి. జగన్ కూడా అంతే. ప్రస్తుతం తాను తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీకి మేలు చేసినా, నష్టం చేసినా ఆయనే బాధ్యత వహించక తప్పదు.ప్రధానంగా మద్యం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయింది. లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ మద్యం దుకాణాలు తెరిచాయి. దీంట్లో జగన్ ను తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే మద్యం ధరలు 75 శాతం పెంచడమే వివాదంగా మారింది. మద్యం ధరలను పెంచడాన్ని కూడా ఎవరూ ఆక్షేపించారు. కానీ దాని ప్రభావం కుటుంబాలపై పడుతుంది. ఆ ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడుతుంది.మద్యం దుకాణాలు తెరిచిన వెంటనే మందుబాబులు ఇళ్లల్లో ఉన్న కొద్దిపాటి సొమ్మును లాగేసుకుని లిక్కర్ షాపులకు పరుగులు తీస్తున్నారు. నలభైై రోజుల నుంచి మద్యం మానుకుని కుటుంబం తేరుకుంటున్న సమయంలో దుకాణాలు తెరవడం పట్ల మహిళల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తుతోంది. లాక్ డౌన్ కారణంగా అసలే పనులు లేవు. దాతలు ఇచ్చిన సాయంతో కొంత నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న నాలుగు రూకలు మద్యానికి తగలేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. కొందరైతే అప్పులు చేసి మరీ మద్యం బాటిళ్లతో ఇళ్లకు చేరుకుంటడంతో మహిళలు ధర్నాలకు దిగుతున్నారు.జగన్ తన మ్యానిఫేస్టోలో మద్య నిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. దశల వారీగా మద్యనిషేధాన్ని చేస్తానని చెప్పారు. అయితే అనుకోకుండా వచ్చిన సమయాన్ని దీనికి వినియోగించుకుంటే బాగుండేదన్న సూచనలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం కోసమే మద్యం దుకాణాలు తెరిచారు. ధరలు పెంచినందున మద్యం మానేస్తారన్న ప్రభుత్వ వాదన సరికాదు. దీంతో వేల కుటుంబాలు లాక్ డౌన్ సమయంలో మద్యం కారణంగా మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం భవిష్యత్తులో జగన్ పార్టీపై పడక మానదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. జగన్ ఎన్ని సంక్షేమ పథకాలను ప్రకటించినా ఏమి లాభమన్న పెదవి విరుపులు విన్పిస్తున్నాయి.