జూపూడి ప్రభాకర్..దారెటు
ఒంగోలు, మే 14
జూపూడి ప్రభాకర్. దాదాపు ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ వింగ్ నాయకుడిగా.. మాల మహానాడు నేతగా, ఫైర్ బ్రాండ్ విమర్శకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. 2014లో ప్రకాశం జిల్లా కొండపి నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి టీడీపీ హవా ముందు ఓడిపోయారు. తర్వాత కాలంలో ఆయన టీడీపీలోకి జంప్ చేశారు. ఆ క్రమంలోనే ఎస్సీ కార్పొరేషన్.. ఫైనాన్స్ వింగ్ చైర్మన్గా వ్యవహరించారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో చంద్రబాబు ప్రకాశం జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట సీటు ఇస్తారని ఆశలు పెట్టుకోగా బాబు జూపూడి ప్రభాకర్ని అస్సలు పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత.. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. నిజానికి టీడీపీలో ఉన్న సమయంలో జగన్ను తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ.. జగన్ ఆయనను పార్టీలోకి తిరిగి తీసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది.అయితే, తర్వాత వచ్చిన వార్తల ను బట్టి.. వైసీపీ నుంచి టీడీపీలోకి వ్యూ హం ప్రకారం వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం మాత్రం ఆయన వైసీపీలోనే ఉన్నారు. కానీ, ఇప్పడు మాత్రం ఆయన తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను మరిచిపోయారా ? అనే సందేహం వ్యక్తమవుతోందని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. కూడా జూపూడి ప్రభాకర్ ఎక్కడా నోరు విప్పడం లేదు. అంతేకాదు, అసలు ఆయన ఎక్కడా కనిపించడం కూడా లేదు. అయితే, దీనికి సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు పార్టీలో ఆయనను పట్టించుకునేవారు కరువయ్యారని, ఆయన విశ్వసనీయతపై ప్రతి ఒక్కరూ సందేహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.గతంలో పార్టీ తరపున ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. కీలకమైన నాయకులు జూపూడి ప్రభాకర్ ని పక్కన పెడుతున్నారని సమాచారం. పార్టీకి సంబంధించిన సమాచారం కూడా జూపూడి ప్రభాకర్ కి తెలియ కుండా జాగ్రత్తపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న జూపూడి ప్రభాకర్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. నిజానికి ఉదయం సాయంత్రం జరిగే టెలివిజన్ చర్చల్లో పాల్గొనే ఆయన ఇప్పుడు వాటికి కూడా హాజరు కావడం లేదు.ఇటీవల జూపూడి ప్రభాకర్ని కలిసిన కొందరు సన్నిహితులు ఏమన్నా ఎక్కడా కనపడడం లేదేం ? అని ప్రశ్నిస్తే ఎక్కడా పార్టీలో జాయిన్ అయిన రోజు మాత్రమే జగన్ అపాయింట్మెంట్ దొరికింది.. ఆ తర్వాత కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారట. మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ఒక స్థాయిలో రాజకీయాలు చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకపోయినా.. తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న జూపూడి ప్రభాకర్ ఇప్పుడు మాత్రం తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకున్నారని ఎస్సీ వర్గానికి చెందిన ఆయన అనుచరులు చెబుతుండడం గమనార్హం