తినడానికి తిండి లేక ఆలమటిస్తున్న నిరుపేదలు
న్యూఢిల్లీ మే 15
తినడానికి తిండి లేక నిరుపేదలు ఆలమటిస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. ఏ విపత్తు వచ్చినా నష్టపోయేది పేదోడే. ఆకలితో అలమటించేది పేదోడే.. ప్రాణాలు విడిచేది కూడా వారే. కరోనా లాక్డౌన్ కూడా నిరుపేదలకే కష్టం తెచ్చిపెట్టింది. చేతికి పని దొరక్కపోవడంతో.. ఇతరులపై ఆధారపడుతున్నారు. ఈ లాక్డౌన్ మరికొంత కాలం పాటు కొనసాగితే.. నిరుపేదల ఆకలి చావులు లక్షల సంఖ్యలో చూడాల్సి వస్తది. ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టే. ఈ ప్రభావం తక్కువ, మధ్యస్త ఆదాయం కలిగిన దేశాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లోని లాక్డౌన్ చర్యలు.. ఆరోగ్య సేవలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. పిల్లలు, తల్లులకు అవసరమైన మందులు, యాంటీబయోటిక్స్ అందడం లేదు. లాక్డౌన్ చర్యలు పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపానికి దారి తీస్తున్నాయి.యునిసెఫ్, జాన్స్ హాఫ్కిన్స్ బ్లూమార్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు.. లాక్డౌన్లో నిరుపేదల కష్టాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. వారికి అందుతున్న ఆహారం, ఆరోగ్య, వైద్య సేవలపై సమీక్షించారు. లాక్డౌన్ వల్ల ఇప్పటికే ఆదాయం తక్కువ కలిగిన దేశాల్లో చిన్నారులు పోషకాహార లోపానికి గురవుతున్నట్లు వీరి పరిశోధనలో తేలింది. లాక్డౌన్లో 15 శాతం వైద్య సేవలను తగ్గిస్తే.. ఐదేళ్ల లోపు ఉన్న 2,53,000 మంది పిల్లలు, 12,200 మంది తల్లులు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం వచ్చే ఆరు నెలల్లో సంభవించే అవకాశం ఉందని పరిశోధకలు తెలిపారు. ఒక వేళ 52 శాతం వైద్య సేవలు తగ్గిస్తే ఒకేసారి 11,57,000 మంది పిల్లలు, 56,700 మంది తల్లులు చనిపోయే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్ల మందికి సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి.