కేంద్రం సొమ్ముతో.. జగన్ షోకులు
విజయవాడ, మే 16
కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోకులు చేసుకుంటుంది. కేంద్రంలో కనీసం భాగస్వామి కూడా కాకపోయినా రాష్ట్రంలో మాత్రం కేంద్ర పథకాలను కూడా తన క్రెడిట్ లో వేసేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే రాష్ట్రంలో అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం.తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరో విడతగా రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నగదు జమచేసింది. ఆ నిధులను జమచేసి జగన్మోహన్ రెడ్డిని రైతు బాంధవుడిగా పేర్కొంటూ ప్రభుత్వం తమకి ఇష్టమైన పత్రికలతో పాటు.. కష్టమైనా లెక్క ప్రకారం ఇవ్వాల్సిన కొన్ని ప్రముఖ దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. అయితే ఆ ప్రకటనలలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.. అయన తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు కానీ ప్రధాని మోడీ మాత్రం లేరు. పథకం పేరే వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కాగా ప్రకటనల ఫోటోలలో మాత్రం వైఎస్ ఉన్నారు గానీ ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం మాయం చేశారు. గతంలో నిధుల చెల్లింపు సమయంలో ఇచ్చిన ప్రకటనలలో ప్రధాని ఫోటో ఉన్నా ఇప్పుడు మాత్రం మాయం చేసేశారు. దీంతో ఏపీ బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో ఎలాంటి సంబంధంలేని వైఎస్ ఫోటోను ముద్రించగా ప్రధాని ఫోటో లేకపోవడం ఏమిటని తీవ్రంగా స్పందిస్తున్నారు. నిజానికి వైఎస్ కాంగ్రెస్ వాది. బీజేపీకి బద్ద శత్రువు కూడా. సీఎం జగన్మోహన్ రెడ్డికి తండ్రిగా.. మాజీ సీఎంగా అయన ఫోటో ప్రచురించడం అయనకు లాభమే కావచ్చు. కానీ కేంద్రం నిధులతో అమలయ్యే పథకానికి తన శత్రువు ఫోటో ప్రచురించడం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకంలో నలభై శాతం నిధులు కేంద్రానివే. ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా ఇచ్చే 13500 లో 6 వేల రూపాయలు కేంద్రం చెల్లిస్తే మిగతా 7500 రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ప్రకటనలో మాత్రం ఆ కేంద్రాన్ని విస్మరించారు. మొత్తం పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తున్న క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు.నిజానికి ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాలలో కేంద్రం నుండి వచ్చే నిధులు.. వాటి వినియోగం.. పథకాల అమలు గురించి ప్రజలలో కనీసం అవగాహనం ఉండదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు పట్టుబట్టి ప్రచారం చేసినా ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాలలో ప్రజలకు ఎక్కదు. అయితే.. ఈ మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పంథా మార్చి కేంద్రం తెచ్చే పథకాలను ప్రజలోకి తీసుకెళ్తుంది. అందులో భాగంగానే పీఎం కిసాన్ పథకాన్ని ఘనంగా ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం దాన్ని తన వైఎస్ఆర్ భరోసాలో కలిపేసుకుంది. తొలిరోజుల్లో ప్రకటనలలో కూడా కేంద్రానికి వాటా ఇచ్చినా తాజాగా కేంద్రాన్ని పక్కకు నెట్టేసింది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా హైకమాండ్ వరకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి బీజేపీ స్పందన ఇలా ఉంటుందని అంచనావేయకుండానే ఏపీ ప్రభుత్వ పెద్దలు దానికి పూనున్నారని అనుకోవాలా?!