ప్రజలకు నగదు అవసరం చాలా ఉంది
నగదు బదిలీలపై మోదీ దృష్టిపెట్టాలి: రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ మే 16
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నగదు అవసరం చాలా ఉందన్నారు. ఆర్థిక ప్యాకేజీ అంశంపై ప్రధాని మోదీ పునరాలోచించాలన్నారు. నగదు బదిలీలపై ప్రధాని దృష్టిపెట్టాలన్నారు. మన్రేగా కింద 200 రోజుల పనిదినాలు కల్పించాలని రాహుల్ తెలిపారు. రేటింగ్స్ పడిపోతాయన్న ఉద్దేశంతో నేరుగా నగదు బదిలీ చేయడం లేదని ఆరోపించారు. లోటు పెరిగితే, రేటింగ్ పడిపోతుందన్న భయంతో ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు. భారత్కు అంతర్జాతీయ రేటింగ్స్ ఎలా వస్తాయో కూడా రాహుల్ చెప్పారు. రైతులు, కార్మికులు, చిన్న,మధ్య తరహా వ్యాపారవేత్తలతో రేటింగ్స్ మెరుగుపడుతుందని, అందుకే వారికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. నిరుపేదలు, వలస కార్మికుల దీన పరిస్థితులను నిత్యం ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న మీడియాకు రాహుల్ థ్యాంక్స్ చెప్పారు. వేరువేరు ప్రమాదాల్లో మృతిచెందిన వలస కూలీల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లాక్డౌన్ను ఎత్తివేసే ప్రక్రియను చాలా చాకచక్యంగా జరగాలన్నారు. ఇదొక ఈవెంట్ తరహాలో కాకుండా, ఓ ప్రక్రియ తరహాలో జరగాలని రాహుల్ సూచించారు. ఇలాంటి సమయంలో వృద్ధులు, రోగుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఒకర్ని తప్పుపట్టే సమయం ఇది కాదు అని, కానీ వలస కూలీల సమస్యలను పరిష్కరించాలన్నారు. అందరం కలిసి వారిని ఆదుకోవాలన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన వారికి నేరుగా నగదు ఇవ్వాలన్నారు. రాబోయ ఆర్థిక సునామీ గురించి కూడా ఆలోచించాలన్నారు.