మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం..ఆరుగురు కార్మికులు మృతి
భోపాల్ మే 16
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సాగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్లోని సాగర్ - ఛత్తార్పూర్ సరిహద్దులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ కార్మికులంతా మహారాష్ట్ర నుంచి యూపీకి వెళ్తున్నారు. ఘటనాస్థలిలో హృదయవిదారక దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఓ చిన్నారి తన తల్లి మృతదేహం వద్ద ఏడ్చిన ఘటన అందరినీ కలిచివేసింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదస్థలిలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ప్రార్థించారు. యూపీలోని ఔరయ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 31 మంది వలస కార్మికులు రోడ్డుప్రమాదాలకు బలయ్యారు.