పార్టీ పరువును బజారుకీడుస్తున్న నేతలు
కాకినాడ, మే 18
స్వపక్షంలో విపక్షం.. బహుశ ఈ మాట అంటేనే పార్టీల అధినేతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. దీనికి ప్రధాన కారణం.. సొంత పార్టీలోనే నేతలు విమర్శలు ఎక్కుపెడితే.. విపక్షాల నుంచి లేదా ప్రత్యర్థుల నుంచి మరింత దాడి పెరగడం ఖాయమనేదే ప్రధాన సమస్య. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలైతే మరింతగా ఇబ్బందిలో పడతాయి. దీనిని ఎవరూ ఉపేక్షించరు. మరీ ముఖ్యంగా జగన్ వంటి నాయకుడు అసలే ఉపేక్షించడు. ఒక్క చంద్రబాబు మాత్రమే గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు వారికి పదవులు దక్కలేదనో.. లేక ప్రభుత్వంలో తమ సొంత పనులు చేసుకోవడం లేదనో.. చంద్రబాబును టార్గెట్ చేశారు. అయితే, చంద్రబాబు మాత్రం వారిని చూసీ చూడనట్టు వ్యవహరించారు.గుంటూరు అప్పటి వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి ఇలానే చంద్రబాబు సర్కారుపై రెచ్చిపోయారు. అప్పట్లో కనీసం చంద్రబాబు పన్నెత్తు మాట కూడా అనలేదు. ఇక, ఈయనను అడ్డు పెట్టుకుని పలువురు నేతలు రెచ్చిపోయారు. అయితే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలోనూ మొదలైంది. జూనియర్లు సీనియర్లను పక్కన పెట్టడం, ఒకరిపై ఒకరు గెలిచిన ఎమ్మెల్యే లు, ఎంపీలు కత్తులు దూస్తుండడం, నియోజకవర్గాల కన్నా కూడా తమ సొంత వ్యవహారాలు చేసుకోవడం, అభివృద్ధి పేరుతో కుంభకోణాలకు తెరదీయడం, ఇసుక అక్రమాలు.. ఇలా అనేకం ఏడాది పాలన ముగిసే సరికి తెరమీదికి వస్తుండడం పార్టీలోను, ప్రభుత్వంలోనూ కలకలం సృష్టిస్తోంది. ఈ పరిణామం ఇక్కడితో ముగిసిపోయి ఉంటే.. సరిపోయేది.. అయితే, ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి దాకా వచ్చింది.ఒక జూనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ నాయకుడు, రాజకీయాల్లో తలపండిన నాయకుడు, రాష్ట్రంలో ఒకప్పుడు ఒక పార్టీని ముందుండి లీడ్ చేసిన నాయకుడిని టార్గెట్ చేయడం, అది కూడా వైసీపీ పరువును బజారున పడేలా వ్యవహరించడం వంటివి ఇప్పుడు తాజాగా చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవి శాఖల్లో ఉండొచ్చు.. నియోజకవర్గాల్లో ఉండొచ్చు.. లేదా.. ఏకంగా పాలనలోనైనా వెలుగు చూడొచ్చు. అలాటి వాటిని సొంత పార్టీ నేతలు సాధ్యమైనంత వరకు తెరమరుగు చేసే ప్రయత్నం చేయాలి. ఏదైనా ఉంటే.. విపక్షాలు చూసుకుంటాయి. అప్పుడు కూడా ఎదురు దాడి చేయడం ద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత సదరు వైసీపీ ప్రజాప్రతినిధులకు ఉంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి గాడి తప్పుతోంది. ఫక్తు ప్రతిపక్షాల కన్నా ఘోరంగా పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వైసీపీలోనే బాహాటంగానే వినిపిస్తున్నాయి.తమ కేదో సమస్య వచ్చిందని, తన నియోజకవర్గంలో ఏదో పనులు జరగడం లేదని .. మొత్తంగా రాష్ట్రానికే ముడిపెట్టి.. ఒక ప్రభుత్వ శాఖనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ.. అది ప్రభుత్వ బాధ్యత అంటూ వ్యాఖ్యానించడం అనేది కేవలం ప్రతిపక్ష నాయకులకు మాత్రమే చెల్లుతుంది. కానీ, వైసీపీలోని ఓ జూనియర్ ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు పార్టీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ శాఖలను మంత్రులను కూడా రోడ్డున పడేలా వ్యాఖ్యానిస్తుండడంతో అందరూ నివ్వెర పోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేయాల్సిన పని ఈయన చేస్తూ.. ఆయనకు రెస్ట్ ఇస్తున్నారా? అనే వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి. అదేసమయంలో ఇలాంటి వారు ఎంతటి వారైనా చూస్తూ.. పోతే.. అది మొదటికే మోసం వస్తుందని జగన్ను హెచ్చరిస్తున్నారు. మరి సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటి కే ఒక ఎంపీకి ఇచ్చిన వార్నింగ్తో నేతలు హడలి పోతున్నారు. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఉదంతంలో ఎలా వ్యవహరిస్తారో ? సంచలనంగా మారనుంది