బాబు వర్సెస్ జగన్
విజయవాడ, మే 18,
జానికి జగన్ కి ఎన్టీఆర్ కి చాలా పోలిలకు ఉన్నాయి. ఆయన అల్లుడు చంద్రబాబు మాత్రం అచ్చమైన రాజకీయ నాయకుడు అయితే జగన్ మాత్రం రాజకీయంతో పాటు పేదలు, ప్రజల పట్ల కాస్తా ఎక్కువ ఆలోచిస్తారని ఆ పార్టీ నాయకులే చెబుతారు. జగన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అలవాటు అని కూడా అంటారు. అది ఎన్టీఆర్ కి ఉన్న సహజ లక్షణం. మరి అన్న గారి నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఆయన నినాదాలని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక తాను సీఎంగా ఏమేమి తప్పులు చేశానో కూడా చంద్రబాబుకు ఎరుకే. వాటిని సరిచేయమని జగన్ మీద ఇపుడు వత్తిడి తెస్తున్నారు.ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉందే అనుకుంటే మాత్రం పాతికేళ్ళ వెనక్కు వెళ్లాలి. ఆనాడు ఎన్టీఆర్ తాను గెలిస్తే ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని చెప్పారు. ఆ విధంగానే ఆయన అధికారంలోకి రావడం మాటకు కట్టుబడి నిషేధం పెట్టడం జరిగాయి. ఆయన అల్లుడు చంద్రబాబు మాత్రం మామ నుంచి అధికారం గుంజుకున్నారు, కానీ మద్య నిషేధం అమలు మాత్రం అటకెక్కించారు. ఇపుడు జగన్ అధికార పీఠమెక్కితే తన పార్టీ మహిళా నేతల ద్వారా సంపూర్ణ మద్య నిషేధం చేయమంటూ నానా యాగీ చేయిస్తున్నారు.ఇక విశాఖలో విష వాయువులు ఉన్న రసాయన పరిశ్రమలు జనవాసాల్లో ఉన్నాయి. వాటిని తరలించమని చంద్రబాబు తాజాగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన గత పాతికేళ్ళలో పద్నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ పరిశ్రమలు తన కార్యకలాపాలు విస్తరించుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. ఇపుడు అన్నీ అయిపోయాక తాపీగా అవి జనాల మధ్య ఉండకూడని పరిశ్రమలు అంటున్నారు చంద్రబాబు. వాటిని తక్షణం అక్కడ నుంచి తరలించాలని కూడా గట్టిగా కోరుతున్నారు.చంద్రబాబు చేస్తున్న డిమాండ్లు చూస్తూంటే తాను చేయలేని పనులు జగన్ చేయాలంటున్నారు. పైగా తన హయాంలో తప్పు జరిగిందని తెలివిగా దాచి పెట్టి మరీ ఆ విషయాలే బయటకు చెప్పకుండా ఇపుడు మాత్రం వాటిని సరిచేయమంటున్నారు. అంటే ఇది గడుసైన రాజకీయమన్నమాట. నిజానికి బెల్ట్ షాపులను జగన్ సర్కార్ రద్దు చేసింది. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా దానికే ఓటు వేశారు, కానీ చంద్రబాబు మాత్రం సంపూర్ణ నిషేధం తన మామగారిలా విధించమని అంటున్నారు. జగన్ సంపూర్ణ నిషేధం విధిస్తే మళ్లీ ఎపుడైనా చంద్రబాబు వస్తే అప్పటిలాగానే తొలగిస్తారెమోనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.