ఐసోలేషన్ కేంద్రంగా వాంఖడే!
ముంబై, మే 18.
మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. ముంబైలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముంబై కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్కుకు చేరువ కాగా.. మహారాష్ట్ర కేసుల సంఖ్య 33 వేలు దాటింది.దేశంలో కరోనా వైరస్ ప్రభావం లేకుంటే, అన్నీ సవ్యంగా సాగితే ఈ సమ్మర్ సీజన్ ఐపీఎల్ సందడితో ఆహ్లాదంగా సాగి ఉండేది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ అట్టహాసంగా జరిగి ఉండేది. కానీ, కరోనా మహమ్మారితో పరిస్థితి తలకిందులైంది. విచిత్రంగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్కోరు బోర్డులా అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్గా మారింది.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేల మార్కుకు చేరువైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్కు స్వర్గధామమైన వాంఖడే, బ్రబౌర్న్ స్టేడియాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలని భావించింది. అయితే.. కొన్ని కారణాలతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా ముంబై నగరంలోనే ఉన్నాయి. ముంబైలో ఒక్క రోజే 1571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. తాజా కేసులతో ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య 19,967కు ఎగబాకింది. ఇప్పటివరకు 5012 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 734 మంది మృతి చెందినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.మహారాష్ట్రంలో ఆదివారం 2347 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33,053కు చేరింది. కరోనా నుంచి కోలుకొని ఆదివారం 600 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,688కు చేరుకుంది. మహారాష్ట్రలో ఆదివారం ఒక్క రోజే కరోనాతో 63 మంది మరణించారు. మహారాష్ట్రలో ముంబై తర్వాత పుణేలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర పోలీసు శాఖలో 1200 మందికి పైగా కొవిడ్-19 బారినపడ్డారు.